మా బిడ్డను చంపడానికి అనుమతివ్వండి.. కోర్టులో తల్లిదండ్రుల పిటిషన్
‘దీర్ఘకాల అనారోగ్యంతో నరకయాతన అనుభవిస్తోన్న మా బిడ్డ కష్టం చూడలేకపోతున్నాం.. వైద్యం చేయించేందుకు ఉన్నదంతా ఊడ్చిపెట్టాం.. చేతిలో చిల్లిగవ్వలేదు.. మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి..’- ఇది ఓ దంపత
అమరావతి:'దీర్ఘకాల అనారోగ్యంతో నరకయాతన అనుభవిస్తోన్న మా బిడ్డ కష్టం చూడలేకపోతున్నాం.. వైద్యం చేయించేందుకు ఉన్నదంతా ఊడ్చిపెట్టాం.. చేతిలో చిల్లిగవ్వలేదు.. మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి..' అంటూ నిరుపేద చేనేత కార్మిక దంపతులు బుధవారం మదనపల్లె ఏడీజే కోర్టు న్యాయమూర్తిని వేడుకున్నారు.
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం తెట్టు పంచాయతీ పులగూరవారిపల్లెకు చెందిన బొగ్గల చిన్నరెడ్డెప్ప, సునీత దంపతులకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒక కుమారుడు. వీరి పెద్దకుమార్తె శృతిహాసన్(6) న్యూరోఫైబ్రోమా(నరాల బలహీనత)తో బాధపడుతోంది. ఈ బాలికకు మెడ నిలవదు. కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడంతో నిలబడలేదు.
బిడ్డ చికిత్స కోసం చిన్నరెడ్డెప్ప రూ.3 లక్షల వరకూ అప్పులు చేశాడు. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా ప్రయోజనం దక్కలేదు. నొప్పులు తట్టుకోలేక బిడ్డ రోదిస్తుండటం చూడలేకపోతున్నామని దంపతులు బావురుమన్నారు.
బుధవారం మదనపల్లె రెండో అదనపు జిల్లా కోర్టుకు చేరుకున్న వీరు తమ బిడ్డకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ అధికారం తమకు లేదని.. జిల్లా కోర్టు గానీ హైకోర్టులో గానీ సంప్రదించాలని న్యాయమూర్తి కె.వి.మహాలక్ష్మి సూచించారు. దీంతో ఆ దంపతులు బిడ్డతో నిరాశగా వెనుదిరిగారు.