కారణమిదే: చిత్తూరు టిడిపి నేతల అసంతృప్తి, ఏడాదే గడువు
నామినేట్ పదవులను భర్తీ చేయకపోవడంతో చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్ళు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు:నామినేట్ పదవులను భర్తీ చేయకపోవడంతో చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్ళు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.నామినేట్ పదవులను భర్తీ చేయడంలో టిడిపి నాయకత్వం మీనమేషాలు లెక్కిస్తోందని పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు.ఇప్పటికైనా నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కోరుతున్నారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే అప్పటివరకు ఉన్న నామినేటేడ్ పదవులన్నింటిని రద్దుచేస్తూ చంద్రబాబునాయుడు సర్కార్ నిర్ణయం తీసుకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు అనుభవిస్తున్న పదవులకు దెబ్బపడింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పదవులను కోల్పోయారు. తమకు పదవులు వస్తాయని భావించిన తెలుగు తమ్ముళ్ళకు మాత్రం నిరాశే ఎదురైంది. నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయడంలో టిడిపి నాయకత్వం మీనమేషాలు లెక్కించడంతో తెలుగు తమ్ముళ్ళు తీవ్ర మనోవేదనకు లోనౌతున్నారు.
పుణ్యకాలం గడిచిపోతోందనే ఆవేదన టిడిపి నేతల్లో వ్యక్తమౌతోంది. ఇప్పటికైనా నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయాలని టిడిపి నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు.
నామినేటేడ్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్న తెలుగు తమ్ముళ్ళు
ఎప్పుడైతే నామినేటెడ్ పదవులు భర్తీ నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచే ఆ పదవులను ఆశించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.. ఆశావహులు వివిధ దారులలో తమ ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. చిత్తూరులో జిల్లా, రాష్ర్టస్థాయి పదవులు ఎన్నో ఉన్నాయి.ఆచరణలో మాత్రం అది అంతగా అమలు కావడం లేదన్నది టీడీపీ శ్రేణుల భావన! .. ఈ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఏర్పడింది.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది.. ఇంకా చాలా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నామినేటేడ్ పోస్టులకు ఏడాదిపాటే గడువు
నామినేటేడ్ పదవుల కోసం ఆశావహులను ఊరించడమే తప్ప అవేవీ భర్తీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు కూడా గట్టిగా అడగలేకపోతున్నారు.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సతమతమవుతున్నారు. 2019లో ఎలాగూ ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది.. అంటే నికరంగా మిగిలింది ఇంకా ఒక్క ఏడాదే! పార్టీ అధిష్టానం ఇంకా సాచివేత ధోరణిని ఎందుకు అవలంబిస్తున్నదో అర్థం కావడం లేదని నేతలు బాధపడుతున్నారు.
అసహనానికి గురౌతోన్న టిడిపి నేతలు
ఏదో చిన్న పదవి అయినా రాకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న నేతల్లో అసహనం పెరిగిపోతోంది.. తమ అసంతృప్తిని బయటపెట్టలేక.. అలాగని అదిమిపెట్టుకోలేక లోలోన కుమిలిపోతున్నారు. అయితే ఒకట్రెండు సందర్భాలలో మాత్రం నేతల అసంతృప్తి బాహాటంగా వెల్లడయ్యింది.. ఎంతకాలమని ఇలా నాన్చుతూ వస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఉన్న అన్ని రకాల నామినేటెడ్ పదవులను సకాలంలో భర్తీ చేసి ఉన్నట్లయితే సుమారు 600 మందికి పదవులు లభించి ఉండేవని గణాంకాలు చెబుతున్నారు. వ్యవసాయమార్కెట్ కమిటీ పదవుల విషయానికి వస్తే జిల్లాలో మొత్తం 19 కమిటీలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అంతగా ప్రాధాన్యం లేని కమిటీలకు మాత్రం నియామకాలు జరిగాయి.. ప్రాధాన్యత కలిగిన కమిటీలను మాత్రం అధిష్టానం పట్టించుకోవడం లేదు.
దేవాలయాల పాలకవర్గాల నియామకాలు లేవు
చిత్తూరు జిల్లాలో 35 ప్రముఖ దేవాలయాలున్నాయి. అయితే ఇందులో 14 దేవాలయాలకు మాత్రమే పాలకవర్గాలను ఏర్పాటు చేశారు. మిగిలిన దేవాలయాలకు పాలకవర్గాలను నియమించలేదు. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న తిరుపతి తుడా ఛైర్మన్ పదవిని కూడా మొన్ననే భర్తీ చేసింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం.. బీసీ సామాజికవర్గానికి చెందిన నరసింహయాదవ్కు తుడా ఛైర్మన్ పదవిని ఇచ్చింది.. మొత్తంమీద చిత్తూరు జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది చాలా రకాల ఆశలు పెట్టుకున్నారు