చంద్రబాబు కింకర్తవ్యం: ఇక కష్టమే, కేసీఆర్పై అనుమానాలు అందుకే
అమరావతి: జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ విధమైన పాత్ర వహిస్తారనేది ఆసక్తిగా మారింది. బిజెపితో ఆయన ఇంకా తెగదెంపులు చేసుకోలేదు.
మంత్రులను మోడీ ప్రభుత్వం నుంచి వెనక్కి రమ్మన్నారే తప్ప ఎన్డీఎ నుంచి వైదొలుగుతున్నామని చెప్పలేదు. పైగా ఎన్డీఎ నుంచి వైదొలగే విషయంపై ఇంకా నిర్ణయయం తీసుకోలేదని చెప్పారు.
బిజెపితో కొనసాగడం సాధ్యమేనా...
తెలుగుదేశం పార్టీ బిజెపితో కొనసాగడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రత్యేక హోదాపై, రాష్ట్రానికి చేయాల్సిన న్యాయంపై చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే రాజీనామా చేయాలని తమ పార్టీ కేంద్ర మంత్రులను ఆదేశించారు. దానివల్ల ఎన్డీఎలో తెలుుగదేశం పార్టీ కొనసాగడం సాధ్యం కాదనే మాట వినిపిస్తోంది.
ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకే...
ముందుగా నిర్ణయించుకున్న వ్యూహం ప్రకారమే కేంద్రంలోని పెద్దలు నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం చేసిన ప్రకటన ఇందుకు నిదర్శనమని అంటున్నారు. చంద్రబాబు అదే అనుమానం వ్యక్తం చేశారు. ముందుకు నిర్ణయించుకున్న ప్రకారమే కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని ఆయన భావిస్తున్నారు.
గతంలో ఇలా...
కేంద్ర రాజకీయాల్లో గతంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో టిడిపిదే పెద్ద పాత్రనే. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఎన్డిఎ కూటమి ఏర్పాటులోనూ చంద్రబాబుది ప్రధానమైన పాత్రే. కాంగ్రెసు వ్యతిరేక పునాదులపై ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు వైపు వెళ్తుందా అనేది సందేహమే. అయితే, అవసరాన్ని బట్టి నిర్ణయం ఉండవచ్చునని కూడా అంటున్నారు.
కేసిఆర్ ముందే ఇలా...
దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని అనూహ్యంగానే కాకుండా ఆకస్మికంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. బిజెపితో టిడిపి తెగదెంపులు చేసుకుంటే చంద్రబాబు జాతీయ స్థాయిలో వివిద పార్టీలను కూడగట్టే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికే కేసీఆర్ నుంచి థర్డ్ ఫ్రంట్ ప్రకటన వెలువడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే కేసీఆర్పై అనుమానాలు...
అయోమయం సృష్టించి ఆ అవకాశం చంద్రబాబుకు లేకుండా చేయాలనేది థర్డ్ ఫ్రంట్ ప్రకటన చేయడం కేసీఆర్ ఎత్తుగడలో భాగం కావచ్చునని అంటున్నారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు అచ్చెన్నాయుడు అందుకే అనుమానాలు వ్యక్తం చేశారని అంటున్నారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన వెనక ప్రధాని నరేంద్ర మోడీ ఉండవచ్చునని ఆయన సందేహించారు.