అర్ధనగ్న ప్రార్థనలు చేయించి మహిళలపై లైంగిక దాడి
పశ్చిమగోదావరి: తన వద్దకు వచ్చే భక్తులను ఆధ్యాత్మిక బోధనలతో సన్మార్గంలో నడిపించాల్సిన ఓ పాస్టర్ వక్రబుద్ధితో సిగ్గుమాలిన చర్యలకు దిగాడు. తన వద్దకు విశ్వాసకులుగా వచ్చిన మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురంలో గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
గ్రామంలోని కృపామణి చర్చిలో క్రైస్తవ బోధనలు చేసే దిద్దే ఎబినేజర్ దైవ ప్రార్థనల ముసుగులో ఆ సంఘంలోని కొందరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆయన వద్ద దీర్ఘకాలంగా అనుచరునిగా పనిచేస్తున్న వ్యక్తే పాస్టర్ బండారాన్ని బయట పెట్టారు. బాధిత మహిళలతోపాటు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ప్రత్యేక ప్రార్థనల పేరుతో ఎబినేజర్ రాత్రి 11 గంటల సమయంలో కొంత మంది మహిళా ఉపాసకులను చర్చికి పిలిపించుకునేవాడు. వారిని మభ్యపెట్టి వారితో అర్ధనగ్న ప్రార్థనలు చేయించేవాడు. వాటిని వీడియోలో చిత్రీకరించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.
ఎదురు తిరిగే మహిళలకు ఆ వీడియోలను చూపి భయపెట్టేవాడు. కాగా, బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి శుక్రవారం జగన్నాథపురం గ్రామంలో విచారించారు. చర్చిలోనూ, పాస్టర్ ఇంటి వద్దా సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఎబినేజర్ ఇంట్లో విరివిగా కండోమ్స్ లభ్యమయ్యాయి. కాగా, పాస్టర్ ఎబినేజర్ గ్రామం నుంచి పరారయ్యాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.