ఒకే గదిలో పట్టుబడిన సిఐ, లేడీ ఎస్ఐ సస్పెన్షన్
కరీంనగర్ త్రీటౌన్ సీఐ స్వామి, వరంగల్ మహిళా పోలీస్స్టేషన్ ఎస్ఐ రాజ్యలక్ష్మిని గత శనివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వామి, రాజ్యలక్ష్మి మధ్య వివాహేతర సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే ఆరోపణతో రాజ్యలక్ష్మి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల అసెంబ్లీ బందోబస్తు నిమిత్తం వీరు హైదరాబాద్కు వచ్చిన వారు ఓ హోటల్లోని ఒకే గదిలో దొరికిపోయారు.
శనివారం తెల్లవారు జామున అబిడ్స్లోని ఓ హోటల్లో బస చేసిన ఈ జంటను రాజ్యలక్ష్మి భర్త రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విధుల మీద హైదరాబాద్ వచ్చిన సిఐ, ఎస్ఐ ప్రైవేట్ హోటల్లో ఎందుకు బస చేశారని ఎస్ఐ భర్త ప్రశ్నించాడు. సిఐ స్వామి నిజానికి ద్వారకా హోటల్లో బస చేయాల్సిందని, అతను రాజ్యలక్ష్మి బస చేసిన గదికి ఎందుకు వచ్చాడని అన్నారు.
వారిద్దరి మధ్య చాలా కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని, తాను తన భార్య రాజ్యలక్ష్మికి చెప్పినా పద్ధతి మార్చుకోలేదని, దాంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని హైదరాబాద్ వచ్చానని ఎస్ఐ భర్త సునీల్ అన్నాడు. శనివారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో తాను ఆబిడ్స్లో వారు బస చేసిన హోటల్కు వచ్చానని, గది తలుపు తట్టానని, అర గంట తలుపు తట్టినా ఎవరూ తలుపు తీయలేదని ఆయన ఓ ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. అరగంట తర్వాత తలుపు తీసిన సిఐ స్వామి తనను నెట్టేసి పారిపోయాడని అతను చెప్పాడు.
సిఐ పారిపోవడానికి ప్రయత్నించిన దృశ్యాలను ఓ టీవీ చానెల్ శనివారంనాడు ప్రసారం చేసింది. అతను పారిపోయిన తర్వాత రాజ్యలక్ష్మి భర్త సునీల్ గదిలోకి వెళ్లాడు. అక్కడ కూడా రాజ్యలక్ష్మి భర్తపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్వామి, రాజ్యలక్ష్మి అన్నారు. తమపై అబాంఢాలు వేస్తున్నారని వారు విమర్సిస్తున్నారు. సిఐ రాజ్యలక్ష్మి భర్త వారిద్దరిపై హైదరాబాదులోని ఆబిడ్స్ పోలీసులకు పిర్యాదు చేశాడు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని అతను తన ఫిర్యాదులో అన్నాడు. ఆబిడ్స్ పోలీసులు వారిద్దరిపై శనివారం ఉదయం కేసు నమోదు చేశారు.