శిల్ప ఆత్మహత్యపై సీఐడీ విచారణ ప్రారంభం: 'నా భార్యను తెచ్చివ్వండి'
చిత్తూరు: తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటనపై సీఐడీ విచారణ గురువారం ప్రారంభమైంది. సీఐడీ ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందం పని చేస్తుంది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందంలో ఒక మహిళా ఇన్స్పెక్టర్, నలుగురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ప్రొపెసర్ల లైంగిక వేధింపుల కారణంగానే శిల్ప ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
డాక్టర్ శిల్ప ఆత్మహత్య, ఫ్యామిలీని పరామర్శించిన రోజా: సోదరి ఫిర్యాదు, రవిపై వేటు
శిల్ప ఆత్మహత్యకు ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ ప్రొపెసర్ తన చున్నీ లాగాడని ఓ విద్యార్థి ఆరోపించింది. తమను ప్రొఫెసర్లు బెదిరిస్తున్నారని, కీచక ప్రొఫెసర్ రవి కుమార్ ఆగడాలపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. కీచక ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రొఫెసర్లకు రాజకీయ అండ ఉందన్నారు. ఇలాంటి వాతావరణంలో ఎలా చదువుకుంటామని ప్రశ్నించారు.
పరీక్షలో ఫెయిల్ కావడంపై స్నేహితులతో
మే నెలలో డాక్టర్ శిల్ప పీజీ ఫైనలియర్ పరీక్షలు రాశారు. జూలై మొదటి వారంలో వచ్చిన ఫలితాల్లో ఒక పేపరులో ఆరు మార్కులు తక్కువ వచ్చి, ఫెయిలయింది. తనను వేధించిన ప్రొఫెసర్లే ఫెయిల్ చేసినట్లు సన్నిహితులతో చెప్పారు. ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేస్తే అనుమానం వస్తుందని థియరీలో చేయించారని, దీనికోసం ఆ ప్రొఫెసర్లు 20 రోజుల పాటు సెలవు పెట్టారని ఆమె ఆరోపించారని అంటున్నారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని వాపోయారు.
భర్త డ్యూటీకి వెళ్లాక ఆత్మహత్య
సహచరుల సూచన మేరకు రీకరెక్షన్కు దరఖాస్తు చేయగా సోమవారం ఫలితాలు వచ్చాయి. ఈ మార్కులూ యథాతథంగా ఉండటంతో శిల్ప తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఓదార్చినా ఫలితం లేకపోయింది. సోమవారం రాత్రి భర్త డ్యూటీకి వెళ్లాక పీలేరులోని తన ఇంట్లోనే శిల్ప ఉరి వేసుకుంది.
నా బిడ్డకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు
విచారణ ఆలస్యం కావడం వల్లే తమ కూతురు మృతి చెందిందని శిల్ప తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కూతురును హింసించి, చావుకు కారణమైన వారిని జైల్లో పెట్టాలన్నారు. తన బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగవద్దన్నారు.
నా భార్యను నాకు తెచ్చిస్తారా
తన భార్య ఫిర్యాదు చేస్తే అధికారుల్లో ఒక్కరు కూడా న్యాయం చేయలేదని శిల్ప భర్త కన్నీరుమున్నీరు అయ్యారు. నా భార్యను నాకు తెచ్చిస్తారా అని ప్రశ్నించారు. విచారణ జరిపి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. విచారణ విషయాలు ఎవరికీ తెలియడం లేదన్నారు. నా భార్య ఎలాగు తిరిగి రాదని, నిజాలు బయటకు తీయాలన్నారు. మరో ఆడపిల్లకు ఇలా అన్యాయం జరగవద్దన్నారు. అందుకే తమ కుటుంబం పోరాడుతున్నామని చెప్పారు. తనకు జరిగిన అన్యాయంపై తన భార్య ఫిర్యాదు చేస్తే పిచ్చిదనే ముద్ర వేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా దోషులను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.