నకిలీ మద్యం కేసులో ఇద్దరు వైసిపి ఎంఏల్ఏలపై చార్జీషీటు దాఖలు, రాజకీయంగా దెబ్బతీసేందుకేనా ?
నకిలీ మద్యం కేసుల్లో వైఎస్ఆర్ సిపి ఎంఏల్ఏలు కాకాని గోవర్థన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిలతో పాటు మరో 27 మందిపై సిఐడి చార్జీసీటు దాఖలుచేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నకిలీ మద్యం సరఫరా.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఇద్దరు వైఎస్ఆర్ సి పి ఎంఏల్ఏలపై ఎన్నికల్లో కల్తీ మద్యాన్ని సరఫరా చేశారనే ఆరోపణలపై సిఐడి చార్జీషీటు దాఖలు చేసింది.2014 అసెంబ్లీ ఎన్నికల నెల్లూరు జిల్లాల్లో 11 కేసులను సిఐడి విచారణ చేసింది. మాజీ మంత్రి టిడిపి ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసిన సర్వేపల్లి ఎంఏల్ఏ పై సిఐడి చార్జీ షీటు దాఖలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
నెల్లూరు జిల్లాల్లో వైఎస్ఆర్ సి పి, టిడిపి నాయకుల మధ్య మాటల యుద్దం సాగుతోంది. టిడిపి ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని వైఎస్ఆర్ సి పి ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపణలు చేశాడు.
వైఎస్ ఆర్ సిపి ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపణలపై టిడిపి ఎం ఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడ ఘాటుగానే స్పందించారు. తనకు విదేశాల్లో అక్రమాస్తులు లేవన్నారు. కాకాని ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆయన పోలీసులను కోరారు.
కాకాని తప్పుడు ఆరోపణలు చేశాడని సోమిరెడ్డి ఆరోపించాడు.అయితే ఈ తరుణంలోనే 2014 కల్తీ మద్యం కేసుల్లో సిఐడి చార్జీషీటు దాఖలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
వైఎస్ఆర్ సి పి ఎంఏల్ఏలపై సిఐడి చార్జీషీటు
నెల్లూరు జిల్లాలోని కావలి ఎంఏల్ఏ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, సర్వేపల్లి ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డిలపై సిఐడి చార్జీషీటు దాఖలు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మొత్తం 32 కేసులు నమోదయ్యాయి.అయితే నెల్లూరు జిల్లాలోనే 11 కేసులు ఎన్నికల సమయంలో నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాకు చెందిన 11 కేసులకు సంబందించి సిఐడి విచారణ పూర్తిచేసింది.దర్యాప్తు అధికారులు గురువారం నెల్లూరు సిఐడి అధికారులు దాఖలు చేశారు. ఈ చార్జీసీట్లలో ఇద్దరు ఎంఏల్ఏలతో పాటు 27 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఓట్ల కోసం నకిలీ మద్యాన్ని సరఫరా చేశారని ఆరోపణలను వైఎస్ఆర్ సి పి ఎంఏల్ఏలపై టిడిపి ఆరోపణలు గుప్పిస్తోంది.
సోమిరెడ్డి పై ఆరోపణలపై చెక్ కోసమేనా
టిడిపి ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సర్వేపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న వైఎస్ఆర్ సి పి ఎంఏల్ఏ కాకానిగోవర్థన్ రెడ్డి ఇటీవల తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అయితే ఈ ఆరోపణలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. ఏ విచారణకైనా సిద్దమేనని ఆయన ప్రకటించారు.వీరిద్దరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు సాగుతున్న తరుణంలోనే నకీలీ మద్యం కేసుల్లో వైఎస్ఆర్ సి పి ఎంఏల్ఏలపై సిఐడి చార్జీషీటు దాఖలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే టిడిపి వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సి పి ఎంఏల్ ఏలు ఆరోపిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది ?
ఎర్రచందనం స్మగ్లర్ అప్పు అలియాస్ కృష్ణస్మామి ద్వారా చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు కర్ణాటక, గోవా నుండి లారీల్లో మద్యం సీసాలను తెప్పించారు. వాటిని గుట్టుగా పంపిణీ చేశారు. అయితే ఈ మద్యం తాగి ఆరుగురు చనిపోయారు. ఎక్సైజ్ పోలీసులు మద్యం సీసాలను స్వాధీనం చేసుకొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొన్న మద్యంగా గుర్తించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. రాజమండ్రి జైల్లో ఉన్న స్మగ్లర్ అప్పు అలియాస్ కృష్ణస్వామి ద్వారా ఈ మద్యాన్ని తెప్పించారని సిఐడి అధికారులు చెబుతున్నారు.
పార్టీలకు నకిలీ మద్యం కేసుతో ఇబ్బందులేనా
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నకిలీ మద్యం సరఫరాచేశారని చెబుతన్నారు. అయితే నకిలీ మద్యం కేసుల్లో ఇద్దరు వైఎస్ఆర్ సి పి కి చెందిన ఇద్దరు ఎంఏల్ఏ ల పేర్లు కూడ ఉండడం రాజకీయంగా కొంత నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.అదే సమయంలో అధికారాన్ని ఉపయోగించుకొని ప్రత్యర్థులు తమ పేర్లను ఈ కేసులో ఇరికించారని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఏల్ఏలు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆధారాలతో వాస్తవాలను బయటపడితే రాజకీయంగా కొంత నష్టం లేకపోలేదని రాజీకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై కాకాని గోవర్థన్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాజకీయంగా సాగుతున్న పరిణామాలుగా కూడ ప్రచారం సాగుతోంది. అయితే ఈ పరిణామాలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.