నిన్న రంగనాయకమ్మ..నేడు అనూష ఉండవల్లి: టీడీపీ సోషల్ మీడియా కోసం వేట: సీఆర్పీసీ ప్రయోగం
అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తోన్న సోషల్ మీడియా కార్యకర్తల కోసం సీఐడీ విభాగం అధికారుల వేట కొనసాగుతోంది. మొన్నటికి మొన్న 66 సంవత్సరాల వయస్సున్న టీడీపీ సోషల్ మీడియా యాక్టివస్ట్ రంగనాయకమ్మను విచారించిన సీఐడీ అధికారులు.. మరి కొందరిపై నిఘా వేశారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అనూష ఉండవల్లికి నోటీసులను జారీ చేశారు.
రంగనాయకమ్మ పోస్ట్ షేర్ చేసిన లోకేష్- అరెస్టు చేసుకోండని జగన్ సర్కారుకు సవాల్...
రంగనాయకమ్మకు నోటీసులు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఘాటు విమర్శలు, వ్యతిరేక కామెంట్లను చేస్తోన్న వారి కోసం సీఐడీ అధికారులు నిఘా వేశారు. విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విష వాయువులు వెలువడిన ఉదంతంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసిన రంగనాయకమ్మకు నోటీసులు జారీ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహించారు.
అనూష ఉండవల్లి
తాజాగా అనూష ఉండవల్లికి నోటీసులను అందజేశారు. అనూష ఉండవల్లి రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో నివసిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తరచూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు సహా మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపై వివాదాస్పదమైన వ్యాఖ్యలను చేస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట ఆమె ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అవి వివాదానికి దారి తీశాయి.
Recommended Video
మూడు రోజుల్లోగా విచారణకు
అనూష ఉండవల్లి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆమెపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) 41ఏ కింద నోటీసులను ఇచ్చారు. నోటీసులు అందుకున్న మూడు రోజుల్లోగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. నోటీసులను అందుకున్న అనూష ఉండవల్లి దర్యాప్తు సందర్భంగా తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు. సోమ లేదా మంగళవారాల్లో ఆమె సీఐడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.