నన్ను అరెస్ట్ చేస్తారేమో.. సిద్ధం: భూమన, కాదని మండిపడ్డ అంబటి
గుంటూరు: తుని విధ్వంసం ఘటనలో సిఐడి విచారణను ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేస్తారేమో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
తుని ఘటనలో ఆయనకు సిఐడి ఇటీవల నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం నాడు గుంటూరులో సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. బుధవారం రెండో రోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
తుని విధ్వంసం, కాల్ డేటాతో: సీఐడీ ముందుకు భూమన, ముద్రగడను కలవలేదని..
రాష్ట్రంలో వైసిపిని సమూలంగా నాశనం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఈ రోజు విచారణ అనంతరం తనను అరెస్టు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కాపుల ఉద్యమంలో తనను బలిపశువును చేశారన్నారు.
తనను అదుపులోకి తీసుకుంటారో లేదో తెలియదని వ్యాఖ్యానించారు. అయితే తాను దేనికైనా సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. భూమన నోటి నుంచి అరెస్ట్ మాట రావడంతో రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా వైసిపిలో చర్చ సాగుతోంది.
అరెస్టుకు భయపడం: అంబటి
తుని విధ్వంసం కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమన వరుసగా రెండో రోజు కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట పార్టీ నేతలు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, అంబటి రాంబాబులు అక్కడకు వచ్చారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వరుసగా రెండో రోజు సీఐడీ అధికారులు విచారణకు పిలిచిన నేపథ్యంలో భూమన అరెస్టవుతారంటూ వదంతులు వినిపిస్తున్నాయన్నారు. అయితే తాము మాత్రం అలా భావించడం లేదన్నారు. ఒకవేళ భూమన అరెస్టైనా తాము భయపడమని, న్యాయపోరాటం చేస్తామన్నారు.