తుని విధ్వంసంలో కీలక మలుపు: వైసీపీ నేత భూమనకు సీఐడీ నోటీసులు
అమరావతి: తుని విధ్వంసం కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జనవరి 31న తునిలో ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో జరిగిన కాపు గర్జన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
ఇందులో భాగంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డితో పాటు మరో 20 మందికి సీఐడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో నెంబర్ వన్ న్యూస్ చానెల్ యజమాని సుధాకర్నాయుడు కూడా ఉన్నారు.
తుని ఘటనకు సంబంధించి ఈనెల 4న గుంటూరు, రాజమహేంద్రవరంలోని కార్యాలయాల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఐడీ నోటీసులు అందుకున్న భూమన కరుణాకరరెడ్డి 6వ తేదీన విచారణకు హాజరవుతానని సమాధానమిచ్చారు.
ఈ కేసుకు సంబంధంచి మొదటి దఫాలో భాగంగా ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. సీఐడీ అధికారులు కేసులు నమోదు చేసిన వారంతా అమాయకులని, వారిపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ముద్రగడ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో దఫాగా 20 మందికి నోటీసులు జారీ చేశారు.
నోటీసులు అందుకున్న అనంతరం భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తుని కేసులో తనకు నోటీసులివ్వడాన్ని దురుద్దేశపూర్వక కుట్రగా అభివర్ణించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు సర్కారు వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.