అమరావతిలో సీఐడీ జోరు- వరుస అరెస్టులతో అప్రూవర్లుగా అధికారులు.. రైతుల్లోనూ ఆందోళన...
అమరావతిలో వరుస అరెస్టుల పర్వం అధికారులు, రైతులతో పాటు బడాబాబుల గుండెల్లోనూ రైళ్లు పరిగెత్తిస్తోంది. అప్పట్లో అమరావతి రాజధాని కాగానే అందిన కాడికి దోచుకున్న అధికారుల భాగోతాన్ని సీఐడీ ఆధారాలతో సహా బయటపెడుతుండటంతో కొందరు అధికారులు అప్రూవర్లుగా కూడా మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన సీఐడీ.. త్వరలో అరెస్టు చేసే మరికొందరి జాబితాను సిద్ధం చేసింది.
మెగాస్టార్ అండ్ టాలీవుడ్ టీమ్కు అమరావతి రైతుల పోరాట సెగ: మిట్టమధ్యాహ్నం గెస్ట్హౌస్ వద్ద
అమరావతిలో సీఐడీ జోరు...
అమరావతి భూముల్లో రాజధాని పేరుతో జరిగిన క్రయ విక్రయాలపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ చురుగ్గా కదులుతోంది. ఇప్పటికే అసైన్డ్ భూముల అక్రమాలతో పాటు అక్రమ కేటాయింపులపైనా తగిన ఆధారాలు సంపాదించిన సీఐడీ అధికారులు సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని అరెస్టు చేశారు. తాజాగా ఆమె వద్ద పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ రణధీర్ ను కూడా అరెస్టు చేశారు. ఇదంతా అక్రమ కేటాయింపుల వ్యవహారంలో భాగంగా మాత్రమే. అప్పట్లో జరిగిన మరిన్ని అక్రమ కేటాయంపులతో పాటు అసైన్డ్ భూముల వ్యవహారంలో పాలుపంచుకున్న అందరినీ బయటికి లాగాలనేది సీఐడీ ఆలోచనగా కనిపిస్తోంది.
సీఐడీ ఉచ్చులో సీఆర్డీఏ....
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ కమిషనర్ గా పనిచేసిన చెరుకూరి శ్రీధర్ అమరావతి భూములు, ప్లాట్ల కేటాయింపులతో పాటు ఇతరత్రా వ్యవహరాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన చెప్పినట్లు నడుచుకున్న సీఆర్డీఏ అధికారులనే సీఐడీ ఇప్పుడు వరుసగా అరెస్టులు చేస్తోంది. వారిని ప్రశ్నిస్తున్న సందర్భంలో వీరంతా భూ కుంభకోణంలో తమ పాత్రేమీ లేదని, ఉన్నతాధికారులు, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ పేషీల నుంచి వచ్చిన ఫోన్ల ఆదారంగానే తాము ఆ నిర్ణయాలు తీసుకున్నామని, అవసరమైతే అప్రూవర్లుగా మారి సీఐడీకి కావాల్సిన సమాచారం ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది.
త్వరలో కీలక అరెస్టులు...
గతంలో సీఆర్డీఏ భూముల వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారుల జాబితాను సీఐడీ సిద్దం చేస్తోంది. వీరి పాత్రను పక్కాగా నిర్ధారించేలా తగిన ఆధారాలను కూడా సంపాదిస్తోంది. తాజా అరెస్టుల సందర్భంగా బయటపడిన పలు రికార్డులను కూడా వీటికి కలిపి మరిన్ని అరెస్టులకు పక్కా ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఈసారి జాబితాలో సీఆర్డీఏలో ఉన్నతాధికారుల అరెస్టులు కూడా ఉండొచ్చని సీఐడీ అధికారుల దర్యాప్తు శైలిని బట్టి తెలుస్తోంది. అప్పట్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు అప్రూవర్లుగా మారితే వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై సీఐడీ ప్రత్యేకంగా దృష్టిపెడుతోంది.
రైతుల్లోనూ ఆందోళన....
అమరావతి భూముల అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ జోరుతో అప్పట్లో అడిగిన వారికల్లా భూములు అప్పగించిన రైతుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. పెద్దల వ్యవహారాల్లో పావులుగా మారిన తమను కూడా సీఐడీ ఎక్కడ ఇరికిస్తుందో అన్న భయాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాజధాని గ్రామాల్లో సీఐడీ దర్యాప్తు తీరు గమనిస్తున్న రైతులు... తాము అత్యాశ కొద్దీ భూములు అమ్ముకున్నామే తప్ప ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నిన్న మొన్నటి వరకూ రాజధాని ఆందోళనల్లో కనిపించిన రైతులు సైతం ఇప్పుడు వాటికి మొహం చాటేసి ఇళ్లకే పరిమితమవుతున్నారు.