జగన్ ఆఫీస్లోకి నీరు: విచారణలో వేలు వారివైపు.. ఆసక్తికర కోణాలు, వైసిపి కొత్త ట్విస్ట్
ఏపీ అసెంబ్లీలోని జగన్ చాంబరులో వర్షపు లీకేజీ కుట్ర వెనుక ఎవరున్నారనే దానిపై సిఐడి అధికారులు దర్యాఫ్తును వేగవంతం చేశారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీలోని జగన్ చాంబరులో వర్షపు లీకేజీ కుట్ర వెనుక ఎవరున్నారనే దానిపై సిఐడి అధికారులు దర్యాఫ్తును వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన అధికారులు కొందరు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారని తెలుస్తోంది.
జగన్ ఆఫీస్లోకి నీరుపై ట్విస్ట్: కుట్ర కోణం.. పైప్ కట్ చేశారు, బాబు సీరియస్
ప్రాథమికంగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే అసెంబ్లీ భవనం పైనున్న పైపును కోసి లీకేజీకి కారణమయ్యారని సిఐడి అధికారులు దాదాపు నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
అనుమానితుల గుర్తింపు
అసెంబ్లీ ప్రాంగణంలో సిసిటివి ఫుటేజీలను పరిశీలించిన అధికారులు పలువురు వ్యక్తులను ప్రశ్నించారు. వారిలో కొందరు అనుమానితులను గుర్తించారని వార్తలు వస్తున్నాయి.
మిగతా గదుల్నీ చూపించండి
దీనిపై వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి శుక్రవారం నిప్పులు చెరిగారు. జగన్, వైసిపి కార్యాలయాలను మరమ్మతులు చేశాక తమకు చూపించారని ఆరోపించారు. వీటిని చూపించినట్లు మిగతా గదులను కూడా చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.
వారి సీట్లూ తడిచాయి
కేవలం జగన్, వైసిపి కార్యాలయాలే కాదని, ముఖ్యమంత్రి, స్పీకర్, ఎమ్మెల్యేల సీట్లు కూడా తడిచాయని ఆళ్ల వ్యాఖ్యానించారు. కార్యాలయంలోకి నీళ్లు రావడం అసలు కానీ అక్రమాల వల్లే భవనాల నిర్మాణం సరిగా లేదన్నారు.
విచారణ వారిపై కాదని ఆళ్ల నాని ట్విస్ట్
ఈ అంశంపై సిఐడి విచారణకాదని, సిబిఐ విచారణ జరగాలన్నారు. లీకేజీ కోసం పగులగొట్టిన వారిపై కాదని, అక్రమాలతో అన్నీ దిగమింగిన వారిపై విచారణ జరగాలని ఆళ్ల డిమాండ్ చేశారు. సాక్ష్యాధారాలు చెదిరిపోయిన తర్వాత సిఐడి విచారణ చేయడం ఏమిటన్నారు.
వైసిపి వాళ్లే లీకేజీ కుట్ర చేశారని చెప్పే ప్రయత్నం
అక్కడ అన్నింటిని సరి చేసి, సాక్ష్యాధారాలు లేకుండా చేసిన తర్వాత విచారణ ఎలా చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆళ్ల డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష ఉద్యోగులను ప్రశ్నలతో వేధిస్తున్నారని ఆరోపించారు. వైసిపి వాళ్లే లీకేజీకి కుట్ర పన్నారని, తప్పు చేశారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మొదటి అంతస్తులో లీకేజీ లేదని..
మరోవైపు, మంగళవారం కురిసిన భారీ వర్షానికి అసెంబ్లీలోని జగన్ చాంబర్లో పైకప్పు నీళ్లు లోపలకు వచ్చాయి. వాటిని సిబ్బంది ఎత్తి పోశారు. జగన్ కార్యాలయంలోకి నీళ్లు రావడంపై సిఆర్డీఏ అధికారులు కూడా ప్రాథమికంగా లోతుగా పరిశీలించారు. జగన్ చాంబర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. దానిపై మరో అంతస్తు ఉంది. నేరుగా జగన్ చాంబర్లోనే నీళ్లు కారాయి. భవనంపైన ఉపరితలం నుంచి ఒక పైపు ద్వారా వర్షపు నీరు జగన్ చాంబర్లోకి ప్రవేశఇంచాయి. ఆ పైపును ఎవరో సుమారు అంగుళంన్నర వరకు కోశారు. దీంతో నీరు లోపలకు వచ్చింది.
నాలుగు సార్లు వర్షాలు కురిసినా కారలేదు.
అసెంబ్లీ భవనం ప్రారంభించి నాలుగు నెలలు అయిందని, ఈ నాలుగు నెలల్లో నాలుగుసార్లు పెద్ద వర్షాలు పడినా ఎప్పుడూ ఎక్కడా నీళ్లు కారలేదని, ఈసారి మాత్రం జగన్ చాంబర్లోకి నీళ్లు ఎందుకు వచ్చాయని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అందుకే తాము కుట్ర అంటున్నామని చెబుతున్నారు. అంతేకాదు, పైపు కూడా సహజంగా పగిలిన ఆనవాళ్లు లేవు.
అనుమానాలు...
అసెంబ్లీ భవనంపైన 41 పైపులను అమర్చారు. అవన్నీ కింద ఉన్న చాంబర్లకు ఏసీ సరఫరా చేసేందుకు ఉద్దేశించినవే. వాటిలో కేవలం జగన్ చాంబర్కు వెళ్లే పైపు మాత్రమే కోసివేతకు గురికావడం ఎలా సాధ్యం? పైపు సహజంగా పగిలితే వంకరటింకరగా పగుళ్లు ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటి ఆనవాళ్లేమీ లేవు. చక్కగా పైపును కోసినట్లు కనిపిస్తోంది.పైపును కోసివేస్తే.. ఆ పని చేసిందెవరు? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.