భయపెట్టినట్లులేదు: బడ్జెట్పై సీఐఐ, టీఎస్సార్ 'రాజధాని'
హైదరాబాద్: కేంద్ర సాధారణ బడ్జెట్ పైన సీఐఐ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం ప్రారంభించే ముందు.. ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు, కఠినంగా ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ సీఐఐ ప్రతినిధులు మాట్లాడారు.. ముందుగా భయపెట్టినట్లుగా లేదన్నారు. బడ్జెట్ ముదావహం అన్నారు.
ఈ బడ్జెట్ ఎన్నికల తర్వాత వచ్చిన బడ్జెట్గా లేదని, ఎన్నికల ముందు బడ్జెట్లా ఉందని కితాబిచ్చారు. ఆర్థిక మంత్రి అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నాలు చేశారని చెప్పారు.
బడ్జెట్ పైన రాపోలు, టీఎస్సార్
మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్ ఎండమావిగా కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. అతిగా ఆశలు కలిపిస్తే ప్రజానీకంలో వ్యతిరేక ప్రభావం ఉంటుందో రేపటి నుండి గమనిస్తున్నామన్నారు. వ్యక్తిగత అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా జైట్లీ నిలబడే ప్రయత్నాలు చేశారని, తాను వ్యక్తిగతంగా అనాలనుకోవడం లేదని చెబుతూ... ఆ బడ్జెట్కు ఆయనే తట్టుకోలేకపోయినట్లుగా ఉందన్నారు.
ఆయన తీరు బడ్జెట్ పైన ఆయనలో నెలకొని ఉన్న అయోమయానికి సంకేతమని అభిప్రాయపడ్డారు. సామాజిక భద్రత, సంక్షేమానికి విఘాతం కలిగించేలా బడ్జెట్ ఉందన్నారు. కార్పోరేట్కు ఉపయోగపడే బడ్జెట్ అన్నారు. రాజధాని లేని ఏపీకి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పలేదని టీ సుబ్బిరామి రెడ్డి అన్నారు.