పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం: అలీ స్పందన ఇదే
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు అలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా, ఆయన ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై అలీ స్పందించారు.
కొందరు కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని అలీ అన్నారు. తాను వైయస్సార్ పార్టీని వీడేది లేదని అలీ స్పష్టం చేశారు. పదవులు, ప్రయారిటీల కోసం తాను వైసీపీలో చేరలేదన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనే లక్ష్యంతోనే తాను వైసీపీలో పనిచేశానని అలీ చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. జగన్ మనసులో స్థానం ముఖ్యమని అన్నారు. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీలో అంకితభావంతో పనిచేస్తానని అలీ స్పష్టం చేశారు.
ఏ ముఖ్యమంత్రి చెయ్యనిది మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేశారని అలీ అన్నారు. తాను వైసీపీని వీడేది లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు.
కాగా, పవన్ కళ్యాణ్, అలీ చాలా సినిమాల్లో కలిసి నటించారు. అంతేగాక, వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. చాలా సార్లు ఈ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ప్రసంసలు చేసుకున్నారు. అయితే, వైసీపీలో చేరిన సందర్భంలో అలీ చేసిన వ్యాఖ్యలు వీరిద్దరి మధ్య కొంత దూరాన్ని పెంచినట్లుగా వార్తలు వచ్చాయి.