చంద్రబాబుకు ఝలక్: ముద్రగడకు మోహన్ బాబు ప్రశంసలు
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తో సినీ నటుడు మోహన్ బాబు ఆదివారం నాడు కిర్లంపూడిలో సమావేశమయ్యారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఆందోళన కొనసాగిస్తున్నాడు. ముద్రగడ పోరాట యోధుడని మోహన్ బ
తూర్పుగోదావరి జిల్లా : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తో సినీ నటుడు మోహన్ బాబు ఆదివారం నాడు కిర్లంపూడిలో సమావేశమయ్యారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఆందోళన కొనసాగిస్తున్నాడు. ముద్రగడ పోరాట యోధుడని మోహన్ బాబు కితాబునిచ్చారు.
కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేస్తున్న పోరాటం అంటే తనకు ఇష్టమని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ చేస్తోన్న ఉద్యమం సరైంది, న్యాయమైందని ఆయన చెప్పారు.ఈ పోరాటాన్ని తాను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.
కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఆయన చేస్తోన్న పోరాటంలో విజయం సాధించాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.యుద్దంలో విజయం సాధించే యోధుడి తరహలో ఆయన పోరాటాలు ఉంటాయని ఆయన గుర్తుచేశారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయమై ముద్రగడ కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని ముద్రగడ ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. కిర్లంపూడిలో ముద్రగడను సినీ నటుడు మోహన్ బాబు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
కాగా, ముద్రగడ కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు. ఆయనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. కాపు నేతలు చిరంజీవి, దాసరి నారాయణ రావులు కూడా అండగా నిలిచారు. ఇప్పుడు మోహన్ బాబు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.