సినీ పరిశ్రమపై విమర్శలతో టిడిపి మరో సెల్ఫ్ గోల్...ఎలాగంటే?...
అమరావతి:సినీ పరిశ్రమపై విమర్శలు చేసే విషయంలో టిడిపి ఎమ్మెల్సీ వై.రాజేంద్రప్రసాద్ తొందరపడ్డారా?...అంటే ఈ విమర్శలకు స్పందించి సినీ పరిశ్రమ ప్రముఖులు చేస్తున్న ప్రతి విమర్శలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
ఈమధ్యకాలంలో టిడిపికి సంబంధించి చోటుచేసుకుంటున్న విచిత్ర మేమిటంటే వారు ఎవరినైతే ఏమని విమర్శిస్తున్నారో...ఆ విమర్శలు బూమరాంగ్ లాగా టిడిపికే తిరిగి వస్తున్నాయి. ఎలాగంటే సినీ పరిశ్రమలో ఎవరెవరినో నుద్దేశించి టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడేముందు సినీ పరిశ్రమతో సంబంధం ఉండి...టిడిపి పార్టీ లో ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారు, పార్టీ అధినేత కుటుంబ సభ్యులు,బంధువులు, టిడిపి ప్రభుత్వంతో కలసిపని చేసినవారు, ఆ ప్రభుత్వం ద్వారా లబ్దిపొందిన వారు ముందు వీరు ఖచ్చితంగా ప్రత్యేక హోదా పోరాటంలో ముందుండి మిగతా సినీ పరిశ్రమని నడిపించాల్సి ఉంటే అసలు వాళ్లే కనిపించనప్పుడు మిగతా వాళ్లని ఎలా ప్రశ్నిస్తారని సోషల్ మీడియాలో సినీ అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్...ఏమన్నారంటే..
ప్రత్యేక హోదా పోరాటంపై తెలుగు సినిమా పరిశ్రమకు ఏ మాయరోగం వచ్చింది? చేవ తగ్గిపోయిందా? రూ.వందల కోట్ల కనక వర్షం మత్తులోంచి బయటకు రాలేకపోతున్నారా? అంటూ ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ వై.రాజేంద్రప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ తెలుగు హీరోలకు అంత సీన్ లేదని, వారు హాలీవుడ్ స్థాయి నటులు కారని, అంతా ఏజ్ బార్ అయిపోయిన ముసలివాళ్లే ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. తెలుగు డైరెక్టర్లు హీరోయిన్ల అందాలను వర్ణించడానికే పనికొస్తారు తప్ప...వారికి సామాజిక స్పృహ, బాధ్యత లేవని దుయ్యబట్టారు.
రాజేంద్ర ప్రసాద్...ఇంకా ఏమన్నారంటే...
తెలుగు సినిమా కళాకారులు హైదరాబాద్లో బానిస బతుకులు బతుకుతున్నారన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతు పలికితే తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నుంచి తన్ని తరిమేస్తారని, ఆస్తులు లాక్కుంటారని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. తమిళనాడులో జల్లికట్టు కోసం సినీపరిశ్రమంతా ఒక్కతాటిపైకి వచ్చి ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తే ఇక్కడి కళాకారులు మాత్రం ఏసీ గదుల్లో కులుకుతున్నారంటూ ఆరోపించారు. అవార్డులు రాకపోతే లొల్లి చేసే వీరు రాష్ట్రానికి నిధులు రావడం లేదన్న విషయం చెవులకు ఎక్కడం లేదా? మీ కళ్లకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలుగు సినిమా పరిశ్రమ హోదా ఉద్యమంలో పాల్గొనాలని లేకపోతే 5 కోట్ల మంది ఆంధ్రులు తెలుగు సినిమా కళాకారులను వెలివేయడానికి వెనుకాడరంటూ హెచ్చరించారు.
సోషల్ మీడియాలో...విమర్శల వెల్లువ...
ఈ విమర్శలపై సినీ పరిశ్రమ సంగతేమో కానీ...ఆశ్చర్యకరంగా సోషల్ మీడియాలో సినీ అభిమానులు వెంటనే స్పందించారు. అసలు రాజేంద్ర ప్రసాద్ కు మతి ఉండే మాట్లాడాడా?...అంటూ రెచ్చిపోయారు...రాజేంద్రప్రసాద్ సినీ పరిశ్రమ మీద విమర్శలు చేసే ముందు అసలు టిడిపితో సంబంధం...అనుబంధం ఉన్న సినీ ప్రముఖులు ఈ ఉద్యమంలో ఇంతవరకు కనీసం కనిపించకపోవడానికి కారణం ఏమిటో ముందు సమాధానం చెప్పమంటున్నారు. ఎంపి శివప్రసాద్ కామెడీ వేషాలు తప్ప ఆ పార్టీలో ఎమ్మెల్యే, అధినేత బామ్మర్ది, లక్షలాది మంది అభిమానులు కలిగిన నందమూరి బాలకృష్ణ ప్రత్యేక హోదా పోరాటంలో ఎంత చురుకైన పాత్ర పోషిస్తున్నారో గమనించారా? అని ప్రశ్నించారు.
ప్రత్యక్షంగా పరోక్షంగా అనుబంధం...లబ్ధి...
టిడిపితో వివిధ రకాలుగా సంబంధబాంధవ్యాలు ఉన్న తెలుగు సినీ ప్రముఖుల జాబితా తక్కువేమీ కాదని...మరి వాళ్లెవరూ ఇంతవరకు ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొనడం లేదో...కనీసం కనిపించడం లేదో రాజేంద్రప్రసాద్ అది ముందు ఆలోచించాల్సి ఉందన్నారు. టిడిపి అధ్యక్షుడు కుటుంబ సభ్యులు, అతి సమీప బంధువులు అయిన బాలకృష్ణ కాకుండా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా రోహిత్, తారకరత్న ఇంతవరకు ప్రత్యేక హోదా పోరాటంలో కనిపించలేదని, అలాగే పుష్కరాల సమయంలో కీలక పాత్ర పోషించిన బోయపాటి శ్రీను, రాజధాని డిజైన్ల విషయంలో ఏరి కోరి రప్పించుకున్న రాజమౌళి, టిటిడి సభ్యుడు రాఘవేంద్రరావు లాంటి ప్రముఖులు ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొనక పోవడం అటుంచి ఇంతవరకు కనీసం మద్దతుగా కూడా మాట్లాడలేదని...మరి దీనికేం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.
ఆలోచించి మాట్లాడమంటూ...వార్నింగ్.,.
బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడేముందు కనీసం కొంచెం అయినా ఆలోచించి మాట్లాడాలని సినీ అభిమానులు రాజేంద్రప్రసాద్ ను హెచ్చరిస్తున్నారు. నోరు ఉంది కదా అని ఎలా బడితే అలా మాట్లాడితే దాని వల్ల ఊహించని చేటు జరుగుతుందని...మన కంట్లో దూలాలు తీసుకోకుండా వేరే వారి కంట్లో నలుసులు ఎత్తి చూపడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఎద్దేవా చేస్తున్నారు. అయినా ఈ మధ్య ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల్లో ఏ మాత్రం విచక్షణ ఉండటం లేదని...అందుకు సినీ పరిశ్రమపై ఆయన చేసిన తాజా వ్యాఖ్యలే నిదర్శనమని ఎత్తిపొడుస్తున్నారు.