సీఎం జగన్ తో చిరంజీవి భేటీ: ముహూర్తం ఖరారు: సమావేశం ఎందుకంటే..!
మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి అప్పాయింట్ మెంట్ ఖరారైంది. సైరా తనకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వాలంటూ సీఎంఓకు సమాచారం ఇచ్చారు. దీని పైన అధికారులు సీఎంతో చర్చిచంగా ఈ భేటీలో చిరంజీవితో పాటుగా ఆయన తనయుడు రాం చరణ్ సైతం ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అయితే, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత చిరంజీవి తొలి సారి జగన్ ను కలవటానికి అమరావతి వస్తున్నారు. దీంతో..ఈ భేటీ పైన రాజకీయంగా..సినిమా వర్గాల్లోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది.
14న చిరు.. జగన్ భేటీ..
ఇది రాజకీయ..సినీ వర్గాలకు ఆసక్తి కర వార్త. కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్మెంట్ ఖరారు చేసింది. ఈ నెల 14న సీఎం జగన్తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. చిరంజీవి తొలుత ముఖ్యమంత్రి జగన్ ను కలవాలని అనుకుంటున్నానని..తనకు సమయం కేటాయించాలని కోరారు. సైరా సినిమా నిర్మాతగా రాం చరణ్ సైతం ఈ భేటీకి వస్తారని అందులో పేర్కొన్నారు.
సీఎం జగన్ కు సైరా ఆహ్వానం..
తాను కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి ని వీక్షించడానికి రావాల్సిందిగా సీఎం జగన్ను చిరంజీవి కోరనున్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళై ను కలిసిన చిరంజీవి తన సినిమా చూడటానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. గవర్నర్ కు హైదరాబాద్ లోని ప్రసాద్ మ్యాట్రిక్స్ లో ప్రత్యేక షో ద్వారా సినిమా చూసే అవకాశం ఏర్పాటు చేసారు. ఇక, ఏపీలో సైరా సినిమాకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. దీంతో..దానికి ధన్యవాదాలు తెలిపేందుకు చిరంజీవి తన కుమారుడితో కలిసి ముఖ్యమంత్రి జగన్ ను కవలనున్నట్లు సమాచారం.
రాజకీయంగా పవన్ తోనే పోరాటం..
చిరంజీవి ప్రజారాజ్యం అధినేతగా ఉన్న సమయంలో 2009 ఎన్నికల్లో పోటీ చేసారు. అదే సమయంలో జగన్ తొలి సారి రాజకీయ బరిలో కడప నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్దిగా పోటీలో నిలిచారు. ఆ సమయంలో మెగా ఫ్యామిలీ నేరుగా వైయస్సార్ ను టార్గెట్ చేసింది. అదే విధంగా వైయస్సార్ సైతం చిరంజీవి పోటీ చేసిన పాలకొల్లు నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం మొగల్తూరు వెళ్లి అక్కడ చిరంజీవి పైన పంచ్ లు వేసారు. కానీ, చిరంజీవి గురించి జగన్ మాత్రం ఎప్పుడూ నేరుగా విమర్శలు చేయలేదు. అయితే, 2014లో జగన్ ను ఓడించేందుకు అప్పుడు టీడీపీకి మద్దతిచ్చిన పవన్ అప్పట్లో జగన్ పైన అనేక ఆరోపణలు చేసారు. కానీ, జగన్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. అయితే, 2019 ఎన్నికల సమయంలో మాత్రం పవన్ వర్సెస్ జగన్ మధ్య రాజకీయం వేడి పుట్టించింది.
సినీ..రాజకీయ వర్గాల్లో ఆసక్తి..
సైరా సినిమా తో చిరంజీవితో మొదలైన సంబంధాలు..వైసీపీ నేతలతో కంటిన్యూ అవుతోంది. తాడేపల్లిగూడెంలో జరిగిన ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనూ వైసీపీ నేతలు చిరంజీవికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు, కారణం సైరా సినిమా అయినా చిరంజీవి నేరుగా వచ్చి జగన్ తో సమావేశం కావటం మాత్రం అటు సినీ..ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ రాజకీయ మిత్రుడుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబును కలిసారు.జగన్ ను మాత్రం కలవలేదు. కానీ, ఇప్పుడు చిరంజీవి నేరుగా జగన్ వద్దకు వస్తుండటంతో అటు జగన్..ఇటు చిరంజీవి అభిమానులు ఈ ఆసక్తి కర సన్నివేశం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.