నా జిల్లా..నా తమ్ముళ్లు అంటూ : చిరంజీవి టూర్ లో కొత్త కోణం: అన్ని పార్టీల నేతలతో ఇలా...!
ప్రముఖ సినీ హీరో చిరంజీవిలో సైరా జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. సైరా సినిమా తరువాత తొలి సారి ఏపికి వచ్చిన చిరంజీవి సొంత జిల్లా పశ్చిమ గోదావరి లోని తాడేపల్లిగూడెం కు వచ్చారు. అక్కడ ఎస్వీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. చిరంజీవిని కలిసేందుకు పార్టీలకు అతీతంగా పలువురు నేతలు కదిలి వచ్చారు. చిరంజీవికి స్వాగతం పలికారు.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ నుండి తాడేపల్లి గూడెం వరకు చిరంజీవిని వెంట బెట్టుకొని వచ్చారు. ఇక...చిరంజీవి తన ప్రసంగం సమయంలో సైరా గురించి పలు మార్లు ప్రస్తావించారు. అదే విధంగా నా సొంత జిల్లా.. నా తమ్ముళ్లు అంటూ గంటా..ఈలి నాని వంటి వారిని సంబోధించారు. నిర్వాహకులను అభినందించారు. ప్రభుత్వం నుండి అనుమతి ఇప్పించిన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను చిరంజీవి ప్రశంసించారు. ఇక, ఎస్వీఆర్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
నా జిల్లాకు వచ్చాను..నా తమ్ముళ్లు
ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి జిల్లా గురించి ఉద్వేగంగా మాట్లాడారు. నా సొంత జిల్లాకు వచ్చాను.. నా తమ్ముడు గంటా.. మరో తమ్ముడు ఈలీ నాని అంటూ సంబోధించారు. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ కమిటిలో స్థానికంగా అనేక పార్టీల నేతలు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంతకుమార్..పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పైడి కొండల మాణిక్యాల రావు, వట్టి వసంతకుమార్, ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, వాసుబాబు, ఎం.ఎల్.సి ఆర్ సూర్యారావు, ఏలూరు మాజీ ఎం.ఎల్.ఎ బడేటి బుజ్జి , రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా హాజరయ్యారు. వీరందరితోనూ చిరంజీవి ఆప్యాయంగా నడుచుకున్నారు. నా జిల్లా అంటూ చిరంజీవి వ్యాఖ్యలు చేసిన సమయంలో అభిమానులు పరవశించిపోయారు.
వైసీపీ నేతకు అభినందనలు
విగ్రహావిష్కరణకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని.. చొరవ తీసుకున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. నా జిల్లాకు వచ్చిన నన్ను అక్కున చేర్చుకున్న అందరికీ కృతజ్ఞతలు. అలాగే సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ చిరంజీవి అక్కడ ఉన్న వారిని ఉత్తేజ పరిచారు. నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ సంవత్సర కాలంగా చిరంజీవితో ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించాలని చూశాం. ఈ విగ్రమం సైరా నరసింహారెడ్డి విజయోత్సహం తర్వాత ఆవిష్కరిస్తానని చెప్పారు. అదేవిధంగా చిరంజీవి మాట నిలబెట్టుకున్నారు. చలన చిత్రరంగం ఉన్నంతవరకూ చిరంజీవి స్థానం ఎప్పటికీ చిరంజీవిలానే ఉంటుందన్నారు. ఎస్వీఆర్ నటించిన రెండు సినిమాల్లో చిరంజీవి తండ్రి కూడా నటించారని ఎంపీ గుర్తుచేసారు.
ఎస్వీఆర్ స్పూర్తితోనే సినిమాల్లోకి..
తాను ఎస్వీ రంగారావు స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఎస్వీఆర్ తన అభిమాన నటుడని చెబుతూ..ఆయనతో తన తండ్రికి నటించే అవకాశం దక్కిందన్నారు. తన తండ్రి ఆయన నటన గురించి చాలా సార్లు చెబుతూ ఉండేవారని గుర్తు చేసారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ కారణంగానే ఇప్పటికీ అందరి మదిలో నిలిచిపోయారు. ఆయన నటనలోని గొప్పదనం వల్లే ఆయనకు జకార్తా అవార్డు వచ్చిందని చెప్పుకొచ్చారు.
అలాగే ఆయన నటుడిగా ఇచ్చిన స్ఫూర్తితోనే తాను మద్రాసుకు వెళ్లానన్నారు. ఏడాది నుండి ఈ జిల్లాకు రావడానికి ప్రయత్నిస్తుంటే ఇప్పటికి కుదిరిందని..తనను మీ బిడ్డగా ఆదరిస్తున్నారు... అక్కున చేర్చుకుంటున్నారు..అంటూ ఉద్వేగానికి గురయ్యారు. దేశ వ్యాప్తంగా ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కథను సినిమాగా చేశానని చెబుతూనే... ఆ సినిమాను అందరూ ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేసారు. యస్.వి.రంగారావుగారు ఉండుంటే శభాష్ అని నన్ను మెచ్చుకుని ఉండేవారని చిరంజీవి వ్యాఖ్యానించారు.