బీజేపీలోకి గరుడ శివాజీ!! బాబు కంటే గొప్ప నేతగా..నన్ను చంపేయండి: జగన్..కేసీఆర్పై సంచలనం..!
Recommended Video
గరుడు పురాణం ఫేమ్ శివాజీ తిరిగి బీజేపీలో చేరుతున్నారా. ఆయన పరోక్షంగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కొద్ది రోజులుగా అలంద మీడియా ఆయన మీద నమోదు చేసిన కేసులో ఇబ్బందులు పడుతున్న శివాజీ తనను ఇబ్బంది పెట్టిన వారికి త్రీడీ సినిమా చూపిస్తానంటున్నారు. తన కుమారుడి చదువుకు అడ్డుపడిన వారిని తాను వదిలేదిలేదని .. ఎట్టి పరిస్థితుల్లో వారి మీద తెలివిగానే పోరాటం చేస్తానన్నారు. ఇదే సమయంలో తాను రాజకీయంగా తిరిగి జాతీయ పార్టీలో చేరుతున్నట్లుగా స్పష్టం చేసారు. తన పై కేసులు నమోదు చేసిన రావు..రెడ్డి ని వదిలేది లేదన్నారు. కొందరు పోలీసు అధికారుల మీద కామెంట్లు చేసారు. ఇక..తనకు రక్షణ కల్పించాలని ఏపీ సీఎంకు లేఖ రాసానని చెప్పిన శివాజీ..తనను అధికారికంగా చంపేయాలని ఆవేదన వ్యక్తం చేసారు. ఇక..ఏపీ ..తెలంగాణ ముఖ్యమంత్రుల మీద కీలక వ్యాఖ్యలు చేసారు.
బీజేపీలోకి శివాజీ రీ ఎంట్రీ...!
సినీ హీరోగా ఉంటూ బీజేపీలో చేరి కొంత కాలం ఆ పార్టీలో కొనసాగిన శివాజీ తిరిగి బీజేపీలో చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక ఇంటర్వ్యలో ఆయన స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తనను దెబ్బ తీసిన వారిని తిరిగి దెబ్బ తీయటం ఖాయమని హెచ్చరించారు. ఇదే సమయంలో తాను వారిని దెబ్బ కొట్టాలంటే రాజకీయంగానే సాధ్యం అవుతుందని చెప్పుకొచ్చారు. తాను ప్రాంతీయ పార్టీల్లో చేరే ప్రస్తక్తే లేదన్నారు. ప్రధాని మోదీ ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికల విధానం అమలైతే ప్రాంతీయ పార్టీలు ఉండవని చెప్పుకొచ్చారు. తిరిగి బీజేపీలోనే చేరుతాననే విధంగా శివాజీ వ్యాఖ్యలు చేసారు. తాను ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకే బీజేపీని వీడానని..అందులోనే ఉండి ఉంటే తన పరిస్థితి మరో విధంగా ఉండేదన్నారు. తాను కుల రాజకీయాలు చేసి ఉంటే చంద్రబాబు కంటే మెరుగైన స్థానంలో ఉండేవాడి నని చెప్పారు. యడ్యూరప్ప బీజేపీలో ఉంటూ..పార్టీని వీడి..మరలా బీజేపీలోకి వచ్చిన విషయాన్ని శివాజీ ప్రస్తావించ టం ద్వారా ఆయన బీజేపీలో చేరుతున్నారనే విషయం చెప్పకనే చెప్పినట్లు స్పష్టమవుతోంది.
జగన్ కారణంగా ఒక కులం పారిపోతోంది..
ఇక..శివాజీ తన సహజ ధోరణిలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైనా కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి పదవి ప్రజల కోసమనే విషయాన్ని మరిచి రాచరిక పాలనలో ఉన్నామని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. అప్పుడే ఆశా వర్కర్లు రోడ్ల మీదకు వచ్చారని..అమరావతి నిర్మాణం ఆగిపోయిందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని చెప్పు కొచ్చారు. తనకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ కు మెయిల్ పెట్టానని..అయినా స్పందన లేదన్నారు. జగన్ కారణంగా ఒక కులం అభద్రతా భావంతో ఒక కులం పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక, తెలంగాణ నుండి ఏపీకి నీరు తరలించే ప్రాజెక్టు పైన ఇద్దరు ముఖ్యమంత్రులు ఆలోచన చేస్తున్నారని..ఏపీ వాళ్లను రాక్షసులు అని వ్యా ఖ్యానించిన కేసీఆర్కు ఏపీ ప్రజల సొమ్ముతో ప్రాజెక్టులు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ ఇద్దరు బాగానే ఉన్నా.. తరువాతి రోజుల్లో వచ్చే వారి మధ్య విభేదాలు వస్తే..ఏపీకి నీళ్లు ఎలా వస్తాయని నిలదీసారు. తనకు 25 మంది ఎంపీల ను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెప్పారని..ఇప్పుడు 22 మంది ఎంపీలతో ఏం చేస్తారో కొద్ది రోజులు వేచి చూసిన తరువాతనే స్పందిస్తానని స్పష్టం చేసారు.
నన్ను చంపేయండి...శివాజీ ఎమోషనల్..
ఇక..అలంద మీడియా తన మీద పెట్టిన కేసు..పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధం లేదన్నారు. కేసు పెట్టిన వారి వెనుక ఉన్న రాజకీయ బలమే తన మీద ఇంతటి వేధింపులకు కారనమైందన్నారు. తన కుమారుడు చదువు దెబ్బ తీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసారు. తాను అమెరికా వెళ్లేందుకు శంషాబాద్ వెళ్తే ఆపని పోలీసులు.. దుబాయ్ లో మాత్రం అక్కడకు సమాచారం ఇచ్చి ఆపించారని ఆరోపించారు. ఇప్పుడు పెద్ద ప్రాజక్టులు కడుతూ కేసీఆర్కు దగ్గరయిన వారే..ఢిల్లీలో కేసీఆర్ గురించి ఏం చెబుతున్నారో తెలుసుకోవాలని సూచించారు. తనను ఇలా వేధించటం కంటే చంపేయండి అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తాను రెడ్డి.. రావు లను మాత్రం వదిలేది లేదని స్పష్టం చేసారు. రాజకీయాల్లో మరో సారి యాక్టివ్ రోల్తో వారికి త్రీడి సినిమా చూపిస్తానని శివాజీ శపథం చేసారు.