రాజా అనేవారు, ఎవ్వరికీ సాధ్యంకానిది రామానాయుడు చేశారు: చిరంజీవి
హైదరాబాద్: మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి చిరంజీవి స్పందించారు. ఆయనకు సినిమాల పైనే అభిమానమని, సినిమాలే సర్వస్వమని చెప్పారు. భారత దేశంలోన్ని అన్ని భాషల్లో సినిమాలు తీసి చరిత్ర సృష్టించారన్నారు.
ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కానిది రామానాయుడు సుసాధ్యం చేశారని కితాబిచ్చారు. ఇలాంటి రామానాయుడు మనందరు గర్వించదగ్గ వ్యక్తి అన్నారు. రామానాయుడు మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు తాను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలన్నారు.
రామానాయుడు మృతి జీర్ణించుకోలేనిదన్నారు. ఆయన తనను ఏనాడు పేరు పెట్టి పిలవలేదని, రాజా అని ఆప్యాయత చూపించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఊపిరే సినిమా అన్నారు. సురేష్ సూచన మేరకు సినిమాలు తీయడం ఆపాలని తాను అడిగానని, అప్పుడు రామానాయుడు.. రాజా నేను సినిమాలు తీయడం మానేస్తే నా జీవం ఆగిపోయినట్లేనని చెప్పారని గుర్తు చేసుకున్నారు.
రామానాయుడు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు సంతాపం తెలిపారు. మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, శిద్దా రాఘవ రావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు తదితరులు సంతాపం తెలిపారు.
రామానాయుడుకి అలనాటి నటీమణుల సంతాపం
రామానాయుడి మృతిపట్ల అలనాటి నటీమణులు సంతాపం తెలిపారు. నటీమణులు శారద, కృష్ణకుమారి, కెఆర్ విజయ, షావుకారు జానకి సంతాపం ప్రకటించారు. రామానాయుడితో తమకున్న అనుబంధాన్ని, అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
రామానాయుడితో అనుబంధం ఇప్పటిది కాదని కుటుంబపరమైన సన్నిహిత బంధం తమదని దర్శకులు కె విశ్వనాథ్ అన్నారు. తనతో దర్శకత్వం చేయాలన్నది రామానాయుడు కోరిక అది తీరకుండాలనే వెళ్లిపోయారన్నారు. రామానాయుడు మరణం పిడుగులాంటి వార్త అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.