మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు, కోడ్ అమల్లోకి
హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి సోమవారం ఉదయం ప్రకటించారు. ఉదయం ఆయన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 146 మున్సిపాల్టీలు, 10 మున్సిపల్ కార్పోరేషన్లలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల న్యాయపరమైన చిక్కులు ఉండటంతో నిర్వహించడం లేదన్నారు.
కార్పోరేషన్ ఎన్నికల్లో ఎస్సీలకు ఒకటి, బిసిలకు నాలుగు, జనరల్ 5 రిజర్వ్ ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎస్టీలకు మూడు, ఎస్సీలకు 19, బిసిలకు 46, జనరల్ 78 రిజర్వ్ అయ్యాయన్నారు. ఇన్నాళ్లుగా ఏదో ఒక కారణంతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయన్నారు. ఈ నెల 30న ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ ఉంటుందని, ఈవిఎంల ద్వారా ఉంటుందని చెప్పారు.
అవసరమైతే ఏప్రిల్ 1న రిపోలింగ్ నిర్వహిస్తామని, ఏప్రిల్ 2న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. పార్టీల ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో 9,015 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. 49,583 మంది సిబ్బంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారని చెప్పారు. 4,508 వార్డుల్లో పోలింగ్ జరగనుందన్నారు.
నామినేషన్ల స్వీకర్
ఈ నెల 10 నుండి 13 వరకు కార్పోరేషన్లలో నామినేషన్ల స్వీకరణ, 10 నుండి 14వ నరకు కార్పోరేషన్లలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. 14వ తేదీన నామినేషన్లు వేసేందుకు చివరి తేది అని, 15న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 18న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని చెప్పారు. ఓటర్లు 95,35,824 మంది ఉన్నారని చెప్పారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి..
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయిందున ఎన్నికల కోడ్ ఈ రోజు (సోమవారం) నుండి అమల్లోకి వచ్చిందని రమాకాంత్ రెడ్డి తెలిపారు.
మున్సిపల్ కార్పోరేషన్లలో.. రామగుండం - ఎస్టీ జనరల్, ఏలూరు - బిసి మహిళ, చిత్తూరు - బిసి మహిళ, కడప - బిసి జనరల్, నెల్లూరు - బిసి జనరల్, రాజమండ్రి - మహిళ జనరల్, నిజామాబాద్ - మహిళ జనరల్, అనంత - మహిళ జనరల్, విజయవాడ - అన్ రిజర్వ్డ్, కరీంనగర్ - అన్ రిజర్వ్డ్