తిరుమలలో మంత్రి కొడాలి నాని: నెరవేరిన కోరికలు: ప్రమాణ స్వీకారం తరువాత తొలిసారిగా!
Recommended Video
తిరుపతి: పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని గురువారం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కొడాలి నాని తిరుమలకు రావడం ఇదే తొలిసారి. బుధవారం రాత్రే తిరుమలకు చేరుకున్న కొడాలి నాని పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. ఈ తెల్లవారు జామున ఆయన శ్రీవారిని దర్శించారు. తలనీలాలను అర్పించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా కొడాలి నాని విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తాను స్వామివారిని కోరుకున్నానని, తన కోరిక నెరవేరిందని ఆయన అన్నారు. ఈ సీజన్ లో విస్తారంగా వర్షాలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానని చెప్పారు. ఏడుకొండల స్వామి వారి దయ వల్ల రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయని అన్నారు. ఇన్నాళ్లూ కరవు, కాటకాలను రాష్ట్రం ఎదుర్కొందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదే రాష్ట్రాన్ని వరుణుడు కరుణించాడని అన్నారు. పరిపాలించే వాడు సహృదయుడైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనే విషయం గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చూశామని, మళ్లీ పదేళ్ల తరువాత అలాంటి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పారు.
వచ్చేనెల 1వ తేదీ నుంచి ప్రతి పేదవాడికి నాణ్యమైన సన్నబియ్యం అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సన్నబియ్యం పథకాన్ని తొలివిడతగా శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాష్ట్రం మొత్తానికీ దీన్ని విస్తరింపజేస్తామని అన్నారు. అవినీతికి, రిసైక్లింగ్కి అవకాశం లేకుండా చేయడానికే తాము సంచుల్లో బియ్యాన్ని సరఫరా చేయబోతున్నామని అన్నారు. బియ్యం పంపిణీలో అవినీతి లేకుండా పేదలకు సరఫరా చేస్తామని అన్నారు. అలాగే- అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్తగా రేషన్కార్టుల జారీ ప్రక్రియ చేపడతామని అన్నారు.గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.