నందమూరి కుటుంబం పట్ల కృతజ్ఞతను చాటుకున్న వైఎస్ జగన్ టీమ్లోని మంత్రి
Recommended Video
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి ఆయన. వైఎస్ కుటుంబం అంటే ఎంతగా ఆరాధిస్తారో.. నందమూరి కుటుంబం అంటే అంతగా అభిమానిస్తారు. వైఎస్ జగన్తో ఎంత చనువుగా ఉండగలరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తోనూ అంతే చొరవగా ఉండగలరు. రాజకీయాలకు అతీతంగా ఆయన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్తో, ఇటు తెలుగుదేశం పార్టీలోనూ తనకంటూ అభిమానులు ఏర్పరచుకున్నారు. ఆయనే- కొడాలి నాని. పౌర సరఫరాల శాఖ మంత్రి. ప్రస్తుతం వైఎస్ జగన్ టీమ్లో ఉన్న ఏకైక కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి.
మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే- కొడాలి నాని నందమూరి కుటుంబం పట్ల తనకు ఉన్న అభిమానాన్ని మరోమారు చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు, నటుడు దివంగత నందమూరి హరికృష్ణ విగ్రహాన్ని తన సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా గుడివాడలో ఆవిష్కరించారు. తన సొంత నిధులతో ఆయన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గుడివాడలో ఇదివరకే దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నిలువెత్తు విగ్రహాన్ని ఆయన నెలకొల్పారు.
తాజాగా- ఎన్టీ రామారావు విగ్రహం పక్కనే నందమూరి హరికృష్ణ బస్ట్ సైజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హిందీ అకాడమీ ఛైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ హరికృష్ణతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణకు తెలుగుదేశం పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదని, ఆశించిన ప్రాధాన్యత కూడా లభించలేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సీటు ఇచ్చి చంద్రబాబు నాయుడు చేతులు దులుపుకొన్నారని విమర్శించారు.
నిజానికి- కొడాలి నాని రాజకీయ రంగప్రవేశం తెలుగుదేశంతోనే ఆరంభమైంది. చాలాకాలం పాటు ఆయన టీడీపీలో కొనసాగారు. 2004, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. తన ఆప్తమిత్రుడు జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీలో జరిగిన పరాభవాన్ని, అవమానాలను భరించలేక కొడాలి నాని పార్టీని వీడినట్లు చెబుతుంటారు ఆయన సన్నిహితులు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం తరువాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో గుడివాడ నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా విజయం సాధించారు.