హైకోర్టులో అడ్వకేట్గా కుమార్తె- సుప్రీం జడ్జిగా తాను: ఏపీ రాజధానుల కేసు నుంచి తప్పుకున్న బాబ్డే..
ఏపీలో మూడు రాజధానుల కేసు విచారణలో ఇవాళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టులో ఛీఫ్ జస్టిస్ బాబ్డేతో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, వి రామసుబ్రహ్మణియన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. అయితే ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ లేవెనత్తిన ఓ అభ్యంతరంతో విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.
ఏపీ హైకోర్టులో రాజధాని రైతుల తరఫున దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే కూతురు వాదిస్తున్నట్లు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు బాబ్డే ప్రకటించారు.
అంతే కాకుండా కేసును వేరే బెంచ్కు బదిలీ చేయాలని సుప్రీం రిజిస్ట్రార్ను ఆదేశిస్తూ బుధవారానికి వాయిదా వేశారు. రైతుల తరఫున కింది కోర్టులో వాదిస్తున్న లాయర్ తన కూతురే కాబట్టి ఈ కేసులో తాను ఇచ్చే ఆదేశాలపై ఆ ప్రభావం పడకుండా జస్టిస్ బాబ్డే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, రైతులతో పాటు పలువురు ఈ కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కీలక కేసు కావడంతో ధర్మాసనం కేటాయింపుతో పాటు మిగతా విషయాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇదే కోవలో బాబ్డే కుటుంబ సభ్యులు హైకోర్టులో వాదిస్తున్నారన్న విషయం తెలియగానే ఆయన వెంటనే తప్పుకున్నారు. దీంతో కీలకమైన ఈ కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది.