'రెండు చోట్లా?.. పవన్ పోటీపై క్లారిటీ.. జనసేనలో తానొక్కరే సుప్రీమ్'
జనసేనలో పవన్ మాత్రమే సుప్రీమ్ అని, ఆయన మాట శిలాశాసనం అని అన్నారు.
విజయవాడ: నిన్న మొన్నటిదాకా ద్విముఖంగా సాగిన ఏపీ రాజకీయ పోరు పవన్ కల్యాణ్ ఎంట్రీతో త్రిముఖంగా మారిన సంగతి తెలిసిందే. 2019ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగడం ఖాయమవడంతో.. ఆ పార్టీ కదలికలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Recommended Video
జనసేన బరిలోకి దిగడం ఎవరికి లాభం, ఎవరికి నష్టమనే చర్చ ఓవైపు జరుగుతుంటే?.. పవన్ రాజకీయం చంద్రబాబు నీడలోనే నడుస్తుందా.. లేక సొంత రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. దీనికి తోడు ఆయన రాజకీయ పోటీ ఎక్కడినుంచి ఉంటుందనేది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
రెండు చోట్ల పోటీ
2019ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీకి సంబంధించి జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి స్పందించారు. తమ అధినేత అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. దీంతో పవన్ పోటీపై నెలకొన్న సందిగ్దం వీడినట్టయింది. అయితే పవన్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దీంతో అనంతపురంతో పాటు ఏలూరు నుంచి కూడా ఆయన బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏలూరు నుంచి కూడా?
నిజానికి పవన్ తొలి నుంచి అనంతపురంలో పోటీ చేయడానికి మొగ్గుచూపుతూ వస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాల రీత్యా ఏలూరు నుంచి ఆయన పోటీ చేయవచ్చన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అక్కడే ఓ ఇల్లు కూడా కొనుక్కున్నారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. తాజా ప్రకటనతో ఈ రెండు చోట్ల ఆయన పోటీ ఉంటుందనే దానికి బలం చేకూరుతోంది.
త్వరలోనే కమిటీలు:
రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ పోటీపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేస్తామని తెలిపారు.
పవనే సుప్రీమ్:
జనసేనలో పవన్ మాత్రమే సుప్రీమ్ అని, ఆయన మాట శిలాశాసనం అని అన్నారు. డిసెంబర్ తొలివారం తరువాత పవన్ తన పూర్తి సమయాన్ని పార్టీ కోసమే కేటాయించాలని నిర్ణయించుకున్నారని మహేందర్ రెడ్డి అన్నారు. ఈలోగా తాము పార్టీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్ని పూర్తి చేయాల్సి ఉందన్నారు. పవన్ నియమించిన కమిటీలు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.