నెల్లూరులో బిజెపి, టిడిపి నేతల పరస్పర దాడులు...ఉద్రిక్తత
నెల్లూరు:బిజెపి, టిడిపిల మధ్య మాటల యుధ్దం ముదిరి ఘర్షణలకు దారితీసింది. శుక్రవారం విజయవాడలో ప్రధాని మోడీ నుద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బిజెపి శ్రేణులు రగిలిపోతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నెల్లూరులో బిజెపి నేతలు నిరసన చేపట్టారు. మోడీపై వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి శ్రేణులు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బాలకృష్ణ దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించాయి. అదే సమయంలో మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు టిడిపి శ్రేణులు అదే ప్రాంతానికి చేరుకున్నాయి.
దీంతో తొలుత ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య విమర్శలు,ప్రతి విమర్శలు మొదలై అవి చివరకు ఘర్షణలకు దారితీసాయి. టిడిపి-బిజెపి కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో పలువురు గాయపడ్డారు. దాడుల్లో గాయపడి అస్వస్థతకు గురైన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను హెచ్చరించి అక్కడనుంచి పంపించివేసి ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.