ఈవో అవినీతి ఆరోపణలు: మంత్రి మాణిక్యాలరావు, బొండా ఉమా మధ్య వాగ్వాదం
అమరావతి: దుర్గగుడి అర్చకుడు సుబ్బారావు వ్యవహారం టీడీపీ, బీజేపీ నేతల మధ్య చిచ్చుపెట్టేలా ఉంది. వివరాల్లోకి వెళితే.... దుర్గగుడి ఈవో నర్సింగరావు అర్చకుడుగా పనిచేస్తున్న మంగళంపల్లి సుబ్బారావుపై నోటి దురుసుతనంతో అతడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
దీంతో గురువారం దుర్గగుడి సిబ్బంది నిరసనలతో అట్టుడికిపోయింది. ఈవో నర్సింగరావు నిరంకుశ వైఖరికి నిరసన కారణంగానే సుబ్బారావు ఆసుపత్రి పాలయ్యారని ఆరోపిస్తూ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో అర్చకులు గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల దాకా విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో దీని గురించి సమాచారం అందుకున్న ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావులతో పాటు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అర్చకుడు మంగళంపల్లి సుబ్బారావును శుక్రవారం మంత్రి మాణిక్యాలరావు పరామర్శించారు.
సుబ్బారావు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో తలెత్తిన వివాదంపై విచారణకు ఆదేశించామని నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అయితే నివేదిక వచ్చేవరకు కాకుండా తక్షణమే ఈవోను సస్పెండ్ చేయాలని బోండా ఉమా కోరారు.
ఈవో నర్సింగరావుపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని దుర్గగుడి అర్చకులు శుక్రవారం కూడా నిరసనకు దిగారు. దీంతో ఈవోపై చర్యలు తీసుకుంటాం, ఆందోళన విరమించాలని ఎమ్మెల్యే బోండా, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు వారికి హామీ ఇచ్చారు.
మరోవైపు దుర్గగుడి దగ్గర ఆందోళన చేస్తున్న అర్చకులకు ఎమ్మెల్యే బొండాఉమ సంఘీభావం తెలిపారు. ఆందోళన విరమించాలని కోరారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతలో ఆందోళన చేస్తున్న అర్చకుల వద్దకు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వచ్చారు.
ఈవో నర్సింగరావుపై అవినీతి ఆరోపణలున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. ఈవో అంతర్గత బదిలీలకు డబ్బు వసూలు చేస్తున్నారని ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. బోండా ఉమా ఈవోపై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాలని మంత్రి మాణిక్యాలరావును డిమాండ్ చేశారు. అందుకు మంత్రి ససేమీరా అన్నారు.
నివేదిక రాకుండా ఆయన్ని ఎలా సస్పెండ్ చేస్తామంటూ మాణిక్యాలరావు ఎమ్మెల్యే బోండా ఉమాను ప్రశ్నించారు. దీంతో మంత్రి మాణిక్యాలరావు, బోండా ఉమాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈవో నర్సింగరావుపై అవినీతిపై విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
ఈవో నర్సింగరావు అవినీతిపై దుర్గగుడి సిబ్బంది చేస్తున్న ఆందోళనకు తమ మద్దుతు ఉంటుందని బీజేపీ, వైసీపీ, టీడీపీ, హిందూ సంస్థలు ప్రకటించడం గమనార్హం.