ఎమ్మెల్యేXటిడిపి ఇంఛార్జ్: కుర్చీలు విసురుకొని, దాడి, జగన్పై పల్లె
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, చీరాల తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి సునీతల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఇది ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలకు తోడు కుర్చీలు విసురుకున్నారు. పరస్పరం దాడి చేసుకున్నారు.
ఈ సంఘటన బుధవారం నాడు మధ్యాహ్నం చోటు చేసుకుంది. వికలాంగుల సదరన్ క్యాంపులో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను శాంతింపచేశారు.
ఆస్తులపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: జగన్పై పల్లె
జగన్కు ఆస్తుల పైన ఉన్న ప్రేమ ప్రజల పైన లేదని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన రైతు కోసం చంద్రన్న యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలు మెచ్చుకున్న నాయకుడు చంద్రబాబు అని మంత్రి పరిటాల సునీత అన్నారు.
తాము సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. తాము ఎలాంటి విషయాల పైన అయినా బహిరంగ చర్చకు సిద్ధమని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమా అని సవాల్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరులోని నారాయణసాగరం చెరువులో చేపపిల్లలు వదిలే కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. రైతు శ్రేయస్సు కోసమే చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు రుణమాఫీ అందరికీ అందినప్పటికీ కొంతమంది కావాలని రభస చేస్తున్నారన్నారు.
తనిఖీలతో సిబ్బంది పని తీరులో వేగం పెంచాలి: చంద్రబాబు
పట్టణాలు, నగరాల్లో త్వరలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మున్సిపల్ కమిషనర్లకు తెలిపారు. బుధవారం విజయవాడలోని గేట్వే హోటల్లో పురపాలకశాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి నారాయణ, పురపాలికల కమిషనర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అధికారులంతా ఆకస్మిక తనిఖీలను బలంగా వినియోగించుకోవాలన్నారు. తనిఖీలకు వస్తామని చెప్పి సిబ్బంది పని తీరులో వేగం పెంచేలా చేయాలన్నారు. 2016 కల్లా తొలి విడత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.