పోలింగ్ బూత్ లో కుర్చీలతో కొట్టుకున్నారు: టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఘర్షణ: లాఠీఛార్జీ!
Recommended Video
గుంటూరు: జిల్లాలోని నరసరావు పేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ బూత్ లోనే పరస్పరం వాగ్వివాదానికి దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. తోసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ ఘటనతో సిబ్బంది కొద్దిసేపు పోలింగ్ ను నిలిపివేశారు. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ.. ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
కుర్చీలతో కొట్టుకున్నారు..
నరసరావు పేట బూత్ నంబర్ 100లో ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న టీడీపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కొద్దిసేపు క్యూ లైన్ లో నిల్చున్నారు. ఓటు వేయడానికి వెళ్లిన తరువాత.. గుర్తింపు కార్డుల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా పరస్పరం రెచ్చగొట్టుకునేలా తిట్టుకున్నారు.
అది కాస్తా చిలికి, చిలికి గాలీవానగా మారింది. పోలింగ్ కేంద్రంలోనే ఒకరినొకరు కొట్టుకున్నారు. ఘర్షణ పడ్డారు. పోలింగ్ సిబ్బంది కోసం ఉంచిన ప్లాస్టిక్ కుర్చీలను తీసుకుని కొట్టుకున్నారు. పోలింగ్ బూత్ లోపలే ఘర్షణ చోటు చేసుకోవడంతో ఫర్నిచర్ ధ్వంసమైంది. పోలింగ్ కేంద్రం వెలుపల బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ లోనికి దూసుకొచ్చారు. లాఠీ ఛార్జీ చేసి, వారిని చెదరగొట్టారు. ఘర్షణ పడుతున్న సమయంలో పోలీస్ కానిస్టేబుల్ ఒక్కరే విధుల్లో ఉన్నట్లు సమాచారం.