టీడీపీ-వైఎస్ఆర్సీపీ ఘర్షణలు: ఏలూరులో టీడీపీ అభ్యర్థి బుజ్జి గన్ మెన్ల దౌర్జన్యం?
Recommended Video
కడప/ఏలూరు: రాష్ట్రంలో పోలింగ్ మొదలైన రెండు గంటల వ్యవధిలనే పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనల్లో నలుగురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కడపజిల్లాలోని జమ్మలమడుగు, మైదుకూరు, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఏలూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి బుజ్జి గన్ మెన్లు స్వయంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. చాలాచోట్ల తమ పార్టీ సానుభూతిపరులుగా భావిస్తున్న వారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శనివారపుపేట పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఎమ్మెల్యే వీరంగం సృష్టించినట్లు సమాచారం. ఓటు వేయడానికి శనివారపు పేట పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఏలూరు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై బడేటి బుజ్జి గన్ మెన్లు, అనుచరులు స్వయంగా దాడికి దిగినట్లు చెబుతున్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఆయన తరిమి తరిమి కొట్టారని వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘర్షణల్లో వైఎస్ఆర్సీపీ నాయకుడొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన తల పగిలింది. రక్తంతో తడిచిన దుస్తుల్లోనే ఆయన పోలింగ్ కేంద్రానికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
జమ్మలమడుగులో..
కడపజిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గం పరిధిలోని గుడెంచెరువు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్ పై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేశారు. ఆయన తల పగులగొట్టారు. మరోవంక- ఈ దాడులకు అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ప్రయత్నించారు. దీనితో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాయపడ్డ వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్ ను హుటాహుటిన జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించారు. జిల్లాలోని సమస్యాత్మక నియోజకవర్గాల్లో జమ్మలమడుగు ఒకటిగా గుర్తింపు ఉంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ మహంతి హుటాహుటిన జమ్మలమడుగకు తరలి వెళ్లారు.
మైదుకూరులో..
జిల్లాలోని మరో సమస్యాత్మక నియోజకవర్గం మైదుకూరులో కూడా ఘర్షణలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చాపాడు, బ్రహ్మంగారి మఠం మండలాల పరిధిలోని గ్రామాల్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ ఘటనల్లో నలుగురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.