గుంటూరు:టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ...10మందికి గాయాలు
గుంటూరు:గుంటూరు జిల్లాలో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంటోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే గ్రామాల్లో ఇప్పుడిప్పుడే ప్రత్యర్థి పార్టీల మధ్య వైషమ్యాలు ఘర్షణలకు దారితీస్తున్నాయి.
తాజాగా ఆదివారం ఉదయం గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలోని ఓ ఎస్సీ కాలనీలో టిడిపి-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాలు పరస్పరం ఆయుధాలతో దాడులకు తెగబడటంతో రెండు వర్గాలకు చెందిన 10మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు టిడిపి-వైసిపి వర్గాల మధ్య ఘర్షణల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గ్రామంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేశారు.
రెండు నెలల క్రితం వైసిపి అధినేత జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఇదే జిల్లాలోని కొప్పర్రులో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు తలెత్తాయి. వైసిపి శ్రేణులు జగన్ పాదయాత్రలో పాల్గొని ర్యాలీగా తిరిగివెళుతున్న క్రమంలో కొప్పర్రులో టీడీపీ మైనారిటీ నేతలు వీరిని అడ్డుకున్నారు. దీంతో ఈ విషయమై వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని అది ఘర్షణకు దారితీసింది.