జడ్పీ మీటింగ్లో వాటర్ బాటిల్స్, ఫైల్స్ విసురుకొన్న టిడిపి, వైసీపీ నేతలు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో టిడిపి, వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. శాసనసమండలి డిప్యూటీ ఛైర్మెన్ రెడ్డి సుబ్రమణ్యం, వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిలు ఒకరిపై మరోకరు వాటర్ బాటిల్స్, ఫైల్స్ విసురుకొన్నారు. ఒకరిపై మరోకరు అసభ్యపదజాలంతో తిట్టుకొన్నారు. దీంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో ఇసుక వ్యవహరంపై అధికార, విపక్ష వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మధ్య వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాలో ఉచిత ఇసుక విషయమై వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రశ్నించారు.
ఉచిత ఇసుక విధానం అమలు కావడం లేదన్నారు. ప్రైవేట్ సంస్ధలకు ఇసుకను కేటాయిస్తున్నారని జగ్గిరెడ్డి ఆరోపించారు. అయితే ఈ విషయమై శాసనమండలి డిప్యూటీ ఛైర్మెన్ రెడ్డి సుబ్రమణ్యం అభ్యంతరం వ్యక్తం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆరోపణలను తిప్పికొట్టారు. ఎమ్మెల్యే స్వగ్రామం గోపాలపురంలోనే ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు ఈ అక్రమ ఇసుక తవ్వకాలకు జగ్గిరెడ్డి సహకరిస్తున్నారని రెడ్డి సుబ్రమణ్యం ఆరోపించారు.
దీంతో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం సాగింది. ఇద్దరు కూడ అసభ్య పదజాలంతో దూషించుకొన్నారు. ఒకనొక దశలో జడ్పీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి.
రెడ్డి సుబ్రమణ్య, జగ్గిరెడ్డి ఒకరిపై మరోకరు దాడి చేసుకొనే ప్రయత్నం చేశారు. వాటర్ బాటిల్స్, ఫైల్స్ విసిరేసుకొన్నారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు గాను కొద్దిసేపు జిల్లా పరిషత్ సమావేశాన్ని వాయిదా వేశారు.