పాపికొండలు విహార యాత్రలో ఉద్రిక్తత: గిరిజనులు, టూరిస్టుల మధ్య ఘర్షణ, తీవ్రగాయాలు
తూర్పుగోదావరి: ఎంతో మనోహరంగా సాగే పాపికొండలు విహార యాత్రలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఈ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగతున్నాయి. ఫొటోలు తీసుకునే విషయంలో అక్కడికి వచ్చిన పర్యాటకులు, స్థానిక గిరిజనులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ ఘర్షణలో ఓ స్థానిక మహిళ గాయపడగా, ఆగ్రహించిన గిరిజనులు పర్యాటకులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు పర్యాటకుల తలలు పగిలాయి. కాగా, ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. పాపికొండల పర్యటనలో భాగంగా మార్గం మధ్యలో ఉన్న పేరాంటాల పల్లి సమీపంలో కొంత మంది పర్యాటకులు మంగళవారం ఫొటోలు దిగుతుండగా ఆ గ్రామం వద్ద ఉన్న వారు అడ్డుకున్నారు. అయినా వారి మాటను పెడచెవిన పెట్టినట్లు తెలిసింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరుగుతుండగా బఠానీలు అమ్ముకునే చిరు వ్యాపారి కె.నాగమణి వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించింది.
అయితే, పర్యాటకులు ఆమెపై దాడికి పాల్పడటంతో గాయాల పాలైంది. దీంతో ఆగ్రహించిన స్థానికులు పర్యాటకులపై దాడికి పాల్పడ్డారు. వారి దాడిలో ఇద్దరు పర్యాటకుల తలలు పగిలాయి. తీవ్ర గాయాలు కావడంతో వారిని భద్రాచలంలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం రాజుపేటకు చెందిన నాగమణిని కూడా ఆమె బంధువులు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. కాగా, మంగళవారం సెలవు దినం కావడంతో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిమంది పాపికొండలు విహారయాత్రకు వచ్చారు.