సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గొడవ: దాడి, ఒకరి మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా మడకశిర సమీపంలోని కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా పావగడ పట్టణంలోని అలంకార్ థియేటర్లో శుక్రవారం విషాద సంఘటన జరిగింది. రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య జరిగిన ఘర్షణలో రాకేశ్ నాయక్(20) అనే డిగ్రీ విద్యార్థి మృతిచెందాడు.
పావగడ సీఐ వెంకటేశ్ అందుకు సంబంధించిన వివరాలు అందించారు. పట్టణానికి చెందిన రాకేశ్ నాయక్ పవన్కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్సింగ్ సినిమా చూసేందుకు తన మిత్రులతో స్థానిక అలంకార్ థియేటర్కు వచ్చాడు. సినిమా చూస్తున్న సమయంలో పవన్ కల్యాణ్పై వేరే వర్గంవాళ్లు వ్యాఖ్యలు చేశారు.
దాంతో రాకేశ్నాయక్ వర్గం వారితో ఘర్షణ పడింది. దీంతో ఇరు వర్గాల వారు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రాశేక్నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
రవి అనే వ్యక్తి నెయిల్ కట్టర్కు ఉండే చిన్నపాటి చాకుతో రాకేష్ మెడపై పొడిచినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాన నరం తెగిపోయి రాకేష్ మృతి చెందినట్లు సమాచారం. రాకేష్ను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పోలీసులు రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్థితిలో థియేటర్లో సినిమా ప్రదర్శనను నిలిపేశారు.