బైక్ కోసం గొడవ:తల్లి ప్రాణం తీసింది...కొడుకు ప్రాణాల మీదకు తెచ్చింది
కడప:బైక్ కొనివ్వాల్సిందేనన్న కొడుకు మంకు పట్టు తల్లి ప్రాణంతీయగా...ఆ కొడుకు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడేందుకు దారితీసింది. కడప జిల్లా పుల్లంపేట మండలం శ్రీనివాసపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే..
శ్రీనివాసపురంలో రవికుమారి (50) అనే మహిళకు పవన్ చైతన్యకుమార్రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. రవికుమారి భర్త ఐదేళ్ల క్రితం బ్రెయిన్క్యాన్సర్తో చనిపోయాడు. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రవి కుమారి అతి కష్టం మీద కొడుకు పవన్ చైతన్యకుమార్రెడ్డిని రాజంపేటలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివిస్తోంది.
బీటెక్ ఫస్టియర్ చదువుతున్న పవన్ చైతన్యకుమార్రెడ్డి ఇంజనీరింగ్ లో చేరినప్పటి నుంచే తనకు బైక్ తీసివ్వాలని తల్లిని తరచూ విసిగిస్తున్నాడు. గత వారం రోజుల నుంచి ఈ బైక్ విషయమై తల్లితో గట్టిగా గొడవ పడుతున్న చైతన్యకుమార్రెడ్డి గురువారం బైక్ కొనివ్వకపోతే తానింక బతకనని గొడవపడి వెళ్లిపోయాడు. దీంతో కొడుకు రాక కోసం ఎదురుచూసిన తల్లి అతడు శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కొడుకు ఏమైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడేమోననే వేదనతో తాను కూడా ఇంట్లో ఉన్న సూపర్వాస్మోల్ లిక్విడ్ తాగేసింది.
అది తాగిన కొద్దిసేపటికే ఆ తల్లి నొప్పి భరించలేక కేకలు పెడుతుండటంతో చుట్టుపక్కల వారు ఆమెను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రవికుమారి విషం తాగిందని తెలుసుకొని మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే ఆమె చనిపోయింది. తల్లి చనిపోయిన విషయం చెప్పేందుకు కొడుకు చైతన్యకుమార్ రెడ్డి కోసం వెదకగా...చివరకు అతడు భవనం పైన అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించారు.
అతడు కూడా ఏదో విషం తాగాడని తెలుసుకొని...అతడిని వెంటనే 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చైతన్యకుమార్రెడ్డి కోలుకుంటున్నాడు. అయితే కేవలం బైక్ కారణంగా గొడవ పడి తల్లి చావుకి కారణమైన ఆ కొడుకు...ఇప్పుడు ఆమె మరణంతో ఒంటరివాడయ్యాడని చుట్టుపక్కల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.