ఒకే పనికి కరణం, గొట్టిపాటి శిలాఫలకాలు: అద్దంకిలో ఉద్రిక్తత, పోలీసుల మోహరింపు
ప్రకాశం: జిల్లాలోని అద్దంకిలో సీసీ రోడ్డు శంకుస్థాపన విషయమై తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు మధ్య మరోసారి వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అద్దంకిలోని 14, 17 వార్డుల సరిహద్దు పరిధిలో ప్రభుత్వ వైద్యశాల రోడ్డు నుంచి శివాలయం రోడ్డులో కట్టకిందపాలెం రోడ్డు వరకు సుమారు రూ.18లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులకు సంబంధించి శనివారం ఉదయం 10గంటలకు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్చే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని నగరపంచాయతీ అధికారులు శిలాఫలకాన్ని ఏర్పాటు చేయించారు. ఈ మేరకు గొట్టిపాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.
కాగా, అదే రోడ్డుకు సంబంధించి ఎమ్మెల్సీ కరణం బలరాంతో శనివారం ఉదయం శంకుస్థాపన చేయించాలని శుక్రవారం రాత్రి.. కరణం వర్గీయులు శిలాఫలకాన్ని ఏర్పాటు చేయించారు. ఈ మేరకు పలువురు కౌన్సిలర్లు, నాయకులు శుక్రవారం సాయంత్రం నగరపంచాయతీ కమిషనర్కు వినతిపత్రం అందజేసినట్లుగా సమాచారం.
ఈ క్రమంలో శనివారం ఉదయం అద్దంకి, కరణం వర్గీయలు ఒకే సమయంలో శంకుస్థాపనకు భారీగా చేరుకుంటుండటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు కూడా భారీ మోహరించారు. ఇరువర్గాల శిలాఫలకాలతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.