కరపత్రాలతో హైటెన్షన్..: వర్గపోరుతో హీటెక్కుతోన్న తాడిపత్రి రాజకీయం
ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి, జగదీశ్వర్ రెడ్డి వర్గానికి మధ్యనున్న విభేదాలు కరపత్రాల దాకా దారితీయడం ఇప్పుడు తాడిపత్రి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
అనంతపురం: తాడిపత్రి టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. సొంతగూటి నేటి మధ్యలే అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతుండటంతో స్థానిక రాజకీయం రోజురోజుకు హీటెక్కిపోతోంది.
ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి, జగదీశ్వర్ రెడ్డి వర్గానికి మధ్యనున్న విభేదాలు కరపత్రాల దాకా దారితీయడం ఇప్పుడు తాడిపత్రి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ విభేదాలకు మూల కారణమేంటంటే.. ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు రవీంద్రరెడ్డిపై అవినీతి ఆరోపణలు.
రవీంద్రరెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్న జగదీశ్వర్ రెడ్డి వర్గం.. దీనిపై ఏకంగా కరపత్రాలు ముద్రించింది. కరపత్రాల విషయం జేసీ చెవిన పడగానే ఆయన కూడా తీవ్రస్థాయిలో స్పందించినట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు ఇరు వర్గాలు బహిరంగ చర్చకు సై అంటే సై అనుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఢీ అంటే ఢీ అన్న రీతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య నిప్పు రాజుకుంటుండటంతో ఉన్నతాధికారులు తాడిపత్రిలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.
కరపత్రాలు ముద్రించినందుకు గాను రవీంద్రరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, జయచంద్రారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని జగదీశ్వర్ రెడ్డి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.