వంశధార నదిలో ఘర్షణ...పలువురికి గాయాలు,ఇసుక తవ్వకాలపై వివాదమే!
శ్రీకాకుళం:వంశధార నదిలో ఇసుక తవ్వకాల విషయంలో రెండు గ్రామాల ప్రజల మధ్య చెరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. తవ్వకాలు జరుగుతున్న నదీ గర్భంలోనే ఈ ఘర్షణలు జరగడం గమనార్హం. ఈ గొడవల్లో పలువురు గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే...
కలెక్టర్ ధనంజయరెడ్డి విశాఖపట్టణంలో అవసరాలకు మేరకు పోతయ్యవలస వద్ద ఇసుక ర్యాంపును మంజూరు చేశారు. అయితే వీరు తవ్వకాలు చేస్తున్నప్పుడు వారి గ్రామం పరిధి దాటి బూరవల్లి సరిహద్దుల్లోకి వచ్చి తవ్వకాలు చేస్తున్నారని ఆ గ్రామస్థులు గతంలో అభ్యంతరం తెలిపారు. దీనిపై ఆర్డీఓ దయానిధి, నరసన్నపేట సీఐ పైడిపునాయుడు, మైన్స్ అధికారులు వచ్చి రెండు గ్రామాల ప్రజలతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించారు. అయితే ఈ వివాదం రెండు రోజుల క్రితం నుంచి మళ్లీ రాజుకుంది.
ఈ నేపథ్యంలో పోతయ్యవలస గ్రామస్తులు ఇసుక తవ్వకాలు జరుపుతుండగా బూరవల్లి గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో గొడవ మొదలై ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణల్లో రెండు గ్రామాలకు చెందిన ఆరుగురి వరకూ గాయపడ్డారు. పోతయ్యవలసకు చెందిన అరవల జంగమయ్య, అరవల ఆది నారాయణ, బొబ్బాది చలపతిరావు, అలిగి గణేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీరిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
దీంతో బూరవల్లి వాసులు తమపై దాడికి దిగారంటూ పోతయ్యవలస వాసులు 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో నరసన్నపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు గ్రామాల ప్రజలకు నచ్చచెప్పేందుకు సీఐ పైడిపి నాయుడు ప్రయత్నించిన క్రమంలో పోలీసుల సమక్షంలోనే మరో సారి ఘర్షణ జరిగినట్లు సమాచారం. మరోవైపు తాము నిబంధనలు అతిక్రమించలేదని, తమ తవ్వకాలకు అడ్డుపడకుండా బూరవల్లి గ్రామస్థులను ఒప్పించాల్సిందిగా పోతయ్యవలస గ్రామస్తులు కోరుతున్నట్లు తెలిసిందది. అయితే ఈ ఘర్షణలు శనివారం జరిగినా పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శులు వెల్లువెత్తుతున్నాయి.