బైరెడ్డి Vs బైరెడ్డి: కుటుంబంలో భగ్గుమన్న వర్గపోరు: సినీ ఫక్కీలో కొట్టుకున్న రెండు గ్రూపులు
కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రత్యర్థుల దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా రాజకీయాలపై పట్టు సాధించడానికి ఒకే కుటుంబం రెండుగా చీలిపోయింది. బైరెడ్డి కుటుంబంలో వర్గపోరు భగ్గుమంది. ఘర్షణలకు కారణమైంది. సినీ ఫక్కీలో చోటు చేసుకున్న ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై నందికొట్కూరు పోలీసులు రెండు వర్గాలపైనా కేసులు నమోదు చేశారు. దాడులకు పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఏపీకి ఏ మేరకు లబ్ది చేకూరుతుందో కేంద్ర ప్యాకేజీ పై స్పష్టత రావాల్సి ఉంది : మంత్రి గౌతమ్ రెడ్డి
కర్నూలు జిల్లాలో వర్గ విభేదాలు, గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు.. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఒకే కుటుంబానికి చెందిన రెండు వేర్వేరు పార్టీలు ఈ నియోజకవర్గంపై పట్టు సాధించడానికి చేస్తోన్న ప్రయత్నాలు తరచూ ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. నందికొట్కూరుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీ అర్థర్.. అదే పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య మొన్నటిదాకా రగిలిన అంతర్గత పోరు చల్లారీ, చల్లారక ముందే.. ఈ సారి బైరెడ్డి కుటుంబం మధ్య విభేదాలు తలెత్తాయి.
భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య గ్రూపు తగాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు వర్గాల నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు వర్గాలు అనుచరులు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. రెండు వర్గాల వారూ గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఘర్షణలను నివారించడానికి వెళ్లిన నందికొట్కూరు రూరల్ ఎఎస్ఐ స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది.
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గానికి చెందిన నాయకుడొకరు ముచ్చుమర్రి ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచీ వారి మధ్య అంతర్గత కలహాలు నివురు గప్పిన నిప్పులా ఉంటున్నాయి. ఆ అభ్యర్థిపై కక్ష పెంచుకున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గీయులు ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. ముచ్చుమర్రిలో ఆ అభ్యర్థి, అతని అనుచరులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన నాయకుల అనుచరులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ముచ్చుమర్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.