గుంటూరు జిల్లాలో...రెండు సామాజిక వర్గాల ఘర్షణ...న్యూ ఇయర్ మొదటిమాసంలోనే రెండో ఘటన....
పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి రాగా మరో 15 రోజుల వ్యవధిలోనే మరో ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
జానపాడులో శనివారం సాయంత్రం రెండు సామాజిక తరగతులు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో గ్రామంలో ఆందోళన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం...జానపాడులో ఉన్నత పాఠశాలలో యువకులు క్రికెట్ ఆడుకుంటుండగా వారి మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి చివరకు పంచాయితీ గ్రామంలోని పెద్దల వద్దకు చేరింది. ఈ నేపథ్యంలోనే అగ్రవర్ణం సామాజిక తరగతికి చెందిన కొందరు వ్యక్తులు మరో సామాజిక తరగతికి చెందిన వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎమ్.సైదాబి, ఎమ్.సుభాని, ఎస్కె బుడే, జి.బుడేలకు గాయాలయ్యాయి.
దీంతో బాధితులు స్థానిక పోలీస్స్టేషన్ను ఆశ్రయించినా వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో బాధితుల సామాజిక వర్గానికి చెందినవారు గ్రామంలోని మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో అప్పుడు పోలీసులు రంగప్రవేశం చేసి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఆందోళన విరమించాలని స్థానిక పట్టణ సిఐ వారిని వారించినా తమకు న్యాయం జరగనిదే ఇక్కడినుంచి కదిలే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో సత్తెనపల్లి డిఎస్పి కాలేషావలి ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆయన బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుల సామాజిక వర్గం ఆందోళన విరమించారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని డిఎస్పి కాలేషా వలి తెలిపారు.