లోకేశ్ పైనే జగన్ గురి: మంగళగిరి లో అవకాశం లేకుండా: చినబాబు మరో సీటు చూసుకోవాల్సిందేనా..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంగళగిరి నియోజకవర్గం పైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తన సొంత నియోజకవర్గం పులి వెందుల తరువాత మంగళగిరికి మాత్రమే నిధులు కేటాయించారు. తాను ఏపీలో నివసిస్తున్న నియోజకవర్గం కూడా కావటంతో ఆసక్తి ప్రదర్శించారు. అసలు కారణం మాత్రం రాజకీయమే అనే ప్రచారం సాగుతోంది. ఏపీలో అనేక పట్టణా లు..నగరాలు శాటిలైట్ టౌన్ షిప్గా అభివృద్ది చేసేందుకు ఎంపిక చేసారు. కానీ..మంగళగిరి శాటిలైట్ టౌన్ కోసం అని ప్రస్తావిస్తూ 50 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. దీని వెనుక లోకేశ్ లక్ష్యం అని ప్రచారం మొదలైంది. దీంతో..ఇక వచ్చే ఎన్నికల్లో లోకేశ్ మంగళగిరి నుండి పోటీ చేయకుండా చేయటమే లక్ష్యమా...
లోకేశ్ లక్ష్యంగా జగన్ అడుగులు..
ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును మాత్రమే తన రాజకీయ ప్రత్యర్ధిగా భావిస్తారు. తాజా ఎన్నికల వేళ అదే విషయం స్పష్టం చేసారు. 2014 ఎన్నికల కంటే తాజా ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మెజార్టీ భారీగా తగ్గించగలిగారు. ఇక, ఆయన తనయుడు టీడీపీ భవిష్యత్ అధినేతగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయం లో భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగా ఇప్పుడు జగన్ నేరుగా లోకేశ్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో టీడీపీ నుండి మంగళగిరి అభ్యర్దిగా లోకేశ్ ను ప్రకటించినా..జగన్ తమ అభ్యర్దిని మార్చలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డినే బరిలోకి దించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున మంగళగిరిలో ప్రచారం చేసారు. అదే సభలో ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ కోరిన విధంగానే మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయారు. అయితే, సామాజిక సమీ కరణాల కారణంగా ఆర్కేకు ఖాయమనుకున్న మంత్రి పదవి చివరి నిమిషంలో జారీ పోయింది.
భవిష్యత్లోనూ అవకాశం లేకుండా..
మంగళగిరిలో ఓడిన లోకేశ్ తాను ఓడినా..మంగళగిరి ప్రజల మధ్యే ఉంటానంటూ ఇప్పటికే పలుమార్లు మంగళగిరిలో పర్యటించారు. స్థానిక నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. తాను భవిష్యత్లోనూ మంగళగిరి నుండే పోటీ చేస్తాననే సంకేతాలు ఇస్తున్నారు. చంద్రబాబు..లోకేశ్ ఇద్దరూ ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గ ఓటర్లుగానే ఉన్నారు. తాజా ఎన్నికల్లో స్థానికంగా ఎక్కువ సమయం కేటాయించక పోవటం వలనే తాను ఓడానని లోకేశ్ చెబుతున్నారు. దీంతో ఈ సారి ముందు నండే సంబంధాలను మెరుగుపరుచుకొని ఎక్కడైతే ఓడిపోయారో..అక్కడి నుండే గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టాలని యోచిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో లోకేశ్ ఎక్కడైతే దృష్టి పెట్టారో అక్కడే రాజకీయంగా లోకేశ్ ను దెబ్బ తీయాని జగన్ డిసైడ్ అయ్యారు. అందుకోసం మంగళగిరి నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆర్కేకు మంత్రి పదవి ఇచ్చే వరకు రాజధానికి సంబంధించిన నామినేటెడ్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక, అక్కడ ఎక్కువగా ఉండే చేనేత వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేలా కాండ్రు కమలకు సైతం పదవి ఇవ్వాలని నిర్ణయించారు.
Recommended Video
తొలి బడ్జెట్ నుండే మంగళగిరి మీద ఫోకస్..
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్లోనూ మంగళగిరి మీద ఫోకస్ చేసారు. దీని కోసం పులివెందుల తరువాత మంగళగిరికి మాత్రమే ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. మంగళగిరిని శాటిలైట్ టౌన్ షిప్ గా అభివృద్ది చేసేందుకు 50 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. ఏపీలో శాటిలైట్ టౌన్ షిప్లుగా అభివృద్ది కోసం ఎన్నో పట్టణాలను ఎంచుకున్నారు. కానీ, మంగళగిరికి మాత్రమే ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. దీని ద్వారా పట్టణ రూపు రేఖలు మార్చాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. దీని ద్వారా తాను నివాసం ఉంటున్న నియోజకవర్గాన్ని అభి వృద్ది చేయటంతో పాటుగా భవిష్యత్ లో మంగళగిరిలో లోకేశ్ కు అవకాశం లేకుండా చేయటమే దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే వాస్తవ రూపం దాలిస్తే లోకేశ్ వచ్చే ఎన్నికల నాటికి మరో నియోజకవర్గం చూసుకో వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.