చంద్రబాబుని ప్రశ్నించిన తెలుగువారు: తమిళనాడుకు రూ.10 కోట్ల సాయం ప్రకటించిన ఏపీ
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్ ఆపన్నహస్తం అందించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాను తమిళనాడుతో పాటు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కూడా అతలాకుతలమయ్యాయి.
ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలతో క్షణం తీరిక లేకుండా గడిపిన సీఎం చంద్రబాబు కాస్తంత ఆలస్యంగా తమిళనాడులోని తెలుగువారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వరదలతో అస్తవ్యవస్థంగా తయారైన తమిళనాడుకు రూ.10 కోట్ల ఆర్థిక సహాయం చేయనున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా తమిళనాడుకు జరిగిన నష్టం పూడ్చలేనిదని పేర్కొన్నారు. తమిళ సోదరులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతక ముందు చెన్నై వరదలపై చంద్రబాబు స్పందించనందుకు చెన్నైలోని తెలుగు కుటుంబాలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మన మద్రాస్ కోసం' అంటూ తెలుగు చిత్రపరిశ్రమ సైతం పెద్ద ఎత్తున స్పందించింది. కానీ తెలుగు ప్రజల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాత్రం నామమాత్రంగా కూడా స్పందించలేదు. బాధితుల్లో తెలుగువారు అత్యధికంగా ఉన్నా ఆదుకునేందుకు ఎటువంటి సాయం ప్రకటించకపోవంపై చెన్నైలోని తెలుగువారు తీవ్రంగా విమర్శించారు.
చెన్నైకి జరిగిన నష్టాన్ని చూసి చలించిపోయిన బీహార్, ఒడిశా ముఖ్యమంత్రులు చెరో రూ.5 కోట్లు సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాము తెలుగువాళ్లమనే విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారా? అని అక్కడి తెలుగువారు ప్రశ్నించడంతోనే చంద్రబాబు బుధవారం రూ.10 కోట్ల ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించారు.