ఆంధ్రప్రదేశ్ ఈ శతాబ్దపు రాజకీయ బాధిత రాష్ట్రం:సిఎం చంద్రబాబు;మా స్పందన సానుకూలం:15వ ఆర్థిక సంఘం
Recommended Video
అమరావతి:ఈ శతాబ్దపు రాజకీయ బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్...నిరంతరం 10.5శాతం వృద్ధి సాధిస్తున్నా పక్క రాష్ట్రాలతో సమం కాలేకపోతున్నాం. అందుకే కేంద్రం, ఆర్థిక సంఘం ఉదారంగా వ్యవహరించి ఎపికి సాయం చేయాలి అని 15 వ ఆర్థిక సంఘానికి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. ఈ సమావేశంలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.4,79,823 కోట్లు గ్రాంట్ ఇచ్చి గట్టెక్కించాలని ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. సిఎం అభ్యర్థనల విషయమై ఎన్ కె సింగ్ మాట్లాడుతూ ఆర్థిక సంఘం విధివిధానాలకు లోబడి సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు.
ఆర్థిక సంఘం...సమావేశం
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పర్యటనకు విచ్చేసిన ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. ఈ సమావేశంలో సిఎంతో పాటు రాష్ట్ర మంత్రిమండలిలోని ముఖ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. సిఎం చంద్రబాబు ప్రసంగాన్ని ఆరంభిస్తూ గత రాత్రంతా మేల్కొనే ఉన్నానని, టిట్లీ తుఫాను సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే ఉన్నానని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు తరచూ రాష్ట్రాన్ని నష్టపరుస్తూనే ఉన్నాయంటూ ప్రసంగాన్ని ఆరంభించి...ఎపి ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
సిఎం ఏమన్నారంటే...అప్పుడలా!
"దేశంలో ఎపి కొత్త రాష్ట్రం. నాలుగేళ్లు నిండిన నవజాత శిశువు. విభజన జరిగిన సంవత్సరం 14వ ఆర్థిక సంఘం తిరుపతి వస్తే రాష్ట్ర సమస్యలపై ఇలాగే వినతులు ఇచ్చాం. ఇప్పుడు వచ్చిన ఈ 15వ ఆర్థిక సంఘంలో సభ్యులు చాలామంది నాకు తెలిసిన వారే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాను. పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఆర్థిక సంస్కరణలకు నేను ఆనాడు గట్టి మద్దతుదారుగా ఉన్నానన్న సంగతీ మీకూ తెలుసు. ఏపీలో రెండో దశ సంస్కరణలు అమలు చేసింది నేనే. ఇప్పుడే కాదు...20 ఏళ్ల క్రితమే నేను సాంకేతికతకు మద్దతుదారుని. అప్పుడు హైదరాబాద్లో నేను వేసిన పునాదులే ఈ రోజు దాన్నొక నాలెడ్జ్ సొసైటీగా మార్చాయి. అప్పుడు కాలినడకన న్యూయార్క్లో ఫైళ్లు పట్టుకుని తిరిగి మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్కు తీసుకొచ్చాను...ఇప్పుడూ అంతే.. కాలినడకన న్యూయార్క్లో వర్షంలో తడుస్తూ ఐటీ కంపెనీలను ఏపీకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను."...అని సిఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
రాజకీయం దెబ్బతీసింది
సిఎం చంద్రబాబు ఇంకా ఏం చెప్పారంటే..."రాజకీయం ఏవిధంగా సామాన్య ప్రజలను దెబ్బతీస్తుందనడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉదాహరణ. 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ ఎపి విషయంలో ఆనాడు చేసిన తప్పిదం వల్ల 2 శాతం ఓట్లకు పడిపోయింది. ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలే దానికి కారణం. పంజాబ్, అస్సాం, తదితర రాష్ట్రాల్లో భావోద్వేగాల తీవ్రత తెలిసిందే. కానీ నేను ఆంధ్రుల మనోభావాలను అభివృద్ధి వైపు మళ్లించాను. ప్రజల్లో ప్రత్యేక హోదా భావోద్వేగ అంశంగా మారింది. విభజన సమయంలో పార్లమెంటులో ఏపీకి ప్రధాని ఇచ్చిన వాగ్దానమిది. ఆ హామీ ఇచ్చినప్పుడు ఇప్పటి 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు. కానీ నాలుగేళ్లయినా హోదా హామీని కేంద్రం నెరవేర్చలేదు. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది"...అని తెలిపారు.
అమరావతికి...రూ.37,437 కోట్లు కావాలి
"నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, ఇతర ముఖ్య సదుపాయాల ఏర్పాటుకు రూ.1,09,023 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అందులో ప్రధాన ప్రాంత అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.39,937 కోట్లు అవసరం. కేంద్రం అందులో రూ.2,500 కోట్లు ఇస్తామని చెప్పి, 2014-16 కాలానికి రూ.1500 కోట్లు మాత్రమే అందించింది. మరో రూ.1000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించినప్పటికీ విడుదల చేయలేదు. రాజధాని మౌలిక అవసరాలకు 15వ ఆర్థిక సంఘం రూ.37,437 కోట్లు కేటాయిస్తుందని ఆశిస్తున్నాం. వెనకబడిన జిల్లాల కోసం కేంద్ర ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.22,250 కోట్లు సిఫారసు చేస్తుందని ఆశిస్తున్నాం."...అని చంద్రబాబు కోరారు.
సానుకూలమే...ఎన్కే సింగ్
ప్రజెంటేషన్ తో కూడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం అనంతరం 15 వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ మాట్లాడుతూ సిఎం అభ్యర్థనల్లో ఆర్థిక సంఘం విధివిధానాలకు లోబడి ఉన్న అంశాలనే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర విభజన ఏ పరిస్థితుల్లో జరిగిందీ.. ఎటువంటి సమస్యలను రాష్ట్రం ఎదుర్కొంటోందీ.. మీ కష్టంతో ఏ విధంగా వాటిని ఎదుర్కొంటోందీ...ఇవన్నీ తమ దృష్టిలో ఉన్నాయని ఎన్కే సింగ్ తెలిపారు. మీరు కోరిన సానుకూల దృక్పథంతోనే 15వ ఆర్థిక సంఘం వ్యవహరిస్తుంది...అని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.