అక్రమ పొత్తు నిరూపిస్తా...రాజీనామా చేస్తారా?:బిజెపి ఎమ్మెల్యేకు చంద్రబాబు ఛాలెంజ్
అమరావతి:బీజేపీతో వైకాపా అధినేత వైఎస్ జగన్కు సంబంధం లేదనడం అబద్ధమని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ-బిజెపిది అక్రమ పొత్తు అంటూ సీఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫైర్ అయ్యారు.
జగన్తో తమకు సంబంధం లేదని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధంగా స్పందించారు. జగన్ కేసుల్ని నీరుగార్చేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బిజెపి,వైకాపా ఒకే ముసుగు వేసుకున్నాయని, ముసుగువీరుల ఆటలు రాష్ట్రంలో సాగవన్నారు. బిజెపి-వైసిపి అక్రమ పొత్తు నిరూపిస్తా...రాజీనామా చేస్తారా? అంటూ బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు చంద్రబాబు సవాలు విసిరారు.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చ సందర్భంగా జగన్తో తమకు ఎలాంటి సంబంధం లేదని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ''అధికారం మీకు శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. అధికారంలో రాగానే అవినీతిపరులను జైల్లో పెట్టిస్తానన్న మోదీ... ఇప్పుడు అదే అవినీతిపరులను వెంటేసుకొని తిరుగుతున్నారు. కేసులను ఒక్కొక్కటిగా సడలిస్తూ సాయం చేస్తున్నారు. బీజేపీ, వైసీపీ అక్రమ కలయికను నిరూపిస్తా. మీరు రాజీనామా చేస్తారా'' అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజును చంద్రబాబు ఛాలెంజ్ చేశారు.
2014 కంటే ముందు భాజపా అధికారంలోకి వస్తే ఏడాది లోపు అవనీతిపరులందరినీ బోనెక్కిస్తామని చెప్పారని, స్విస్లో ఉన్న డబ్బును వెనక్కి తీసుకొచ్చి అందరి అకౌంట్లలో వేస్తామని ప్రకటించారని బిజెపి చెప్పిన విషయాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అన్ని కేసులను ఏడాదిలో ప్రక్షాళన చేస్తామని చెప్పిన బిజెపి వేరే వాళ్లపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తోందన్నారు.
ప్రతిపక్షాలపై కుట్రలు చేసేందుకు కేంద్రం శతవిధాలా ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈడీ, ఐటీ, సీబీఐ నోటీసులు ఇచ్చి మమ్మల్ని బెదిరించాలని అనుకుంటున్నారా?.. అంటూ నిలదీశారు. అయితే ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరనే విషయం గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. న్యాయం, చట్టం, ధర్మం ఉంటాయే తప్ప...అధికారం ఉందని ఇష్టానుసారం ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను దుర్వనియోగం చేయడం సరికాదని హితవు పలికారు. వైకాపాతో భాజపాకు సంబంధంలేదనే ముసుగు తీయాలని విష్ణుకుమార్రాజును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు.
కేంద్రానికి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే మనస్సు లేదా...ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేంద్రానికి కనిపించడం లేదా అని నిలదీశారు. పెట్రోల్ ధర పెరగటం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయని, ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే మీరు మాత్రం ఆనందంగా ఉన్నారని, కేంద్రం ప్రజలను మభ్యపెడుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు.