తెలంగాణాలో ఎందుకు పోటీ చేయడం లేదు...జగన్,పవన్ లాలూచీ రాజకీయాలకు ఇదే నిదర్శనం:చంద్రబాబు
నెల్లూరు:జగన్,కేసీఆర్తో కలసి కుట్ర పన్ని టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. మంగళవారం నెల్లూరు ఎస్వీజీఎస్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన టీడీపీ ధర్మపోరాట దీక్ష సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ, జనసేన ఎందుకు పోటీచేయడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. లాలూచీ రాజకీయాలకు ఇది నిదర్శనం కాదా?...అని ఆయన నిలదీశారు. తాను దేశం కోసమే కాంగ్రెస్తో ఉన్న 40 ఏళ్ల బేధాభిప్రాయాలు పక్కనబెట్టానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. బీజేపీపై యుద్ధం ప్రకటించామని...ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేశమంతా తిరుగుతున్నామని...ఎలాగైనా ఈ దేశాన్ని కాపాడుకుంటామని చంద్రబాబు తేల్చిచెప్పారు.
ప్రత్యేక హోదా కోసం పోరాటం సందర్భంగా పార్లమెంట్లో టీడీపీ ఎంపీలను ప్రధాని మోడీ బెదిరించారని సీఎం చంద్రబాబు చెప్పారు. కుట్రలో భాగంలోనే టీడీపీ నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇలాంటి దాడులతో తమ మనోనిబ్బరాన్ని దెబ్బతీయలేరని...తమని ఎంతగా అణిచివేయాలని చూస్తే అంతగా ఎగిసిపడతామని అన్నారు. బీజేపీ దేశంలో అవినీతిని పెంచి పోషిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
సీబీఐని గుజరాత్ కి చెందిన అధికారి రాకేష్ ఆస్థానా భ్రష్టు పట్టించారన్నారు. ఇదే ఎపిసోడ్లో అజిత్ దోవల్ కూడా ఉన్నారంటే దేశ పరిస్థితి ఏమవుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం దుర్వినియోగం అవుతుందనే తాము రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరించామని చంద్రబాబు వివరించారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు ఒక పెద్దగా ఫార్స్గా మారిందని చెప్పారు. దాంతో రూపాయి విలువ పడిపోయిందని, పెట్రో ధరలు పెరిగిపోయాయని, వ్యాపారులు, రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
మోడీ వట్టి మాటలు చెప్పే ప్రధాని మాత్రమేనని...ఆయన వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదని చంద్రబాబు తేల్చిచెప్పేశారు. హామీలు అడిగానని తనకు మెచ్యురిటీ లేదని, కేసీఆర్కు ఉందని ప్రధాని మోడీ అన్నారని బాబు గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ ను టిడిపినే అభివృద్ది చేసిందన్నారు. కెసీఆర్ని కూడా తాను అన్ని విధాలా ప్రోత్సహించానని చంద్రబాబు చెప్పారు. తమని వైసీపీ ఉచ్చులో పడిందని మోడీ అన్నారని...కానీ నిజానికి ఆ పార్టీ ఉచ్చులో పడింది బీజేపీయేన్నారు.