మోడీ, చంద్రబాబు విధానాలు ఒక్కటే...హక్కులు కాలరాయడమే వీళ్ల పని:ఐద్వా నేత బృందా కరత్
రాజమండ్రి: ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విధానాలు ఒకటేని...ఢిల్లీలో రైతులపై మోడీ ప్రభుత్వం విరుచుకుపడితే, కాకినాడ సెజ్లో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఐద్వా ఉపాధ్యక్షురాలు బృందా కరత్ దుయ్యబట్టారు.
రాజమండ్రిలో జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర మహాసభలకు ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు బృందా కరత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోడీ,చంద్రబాబు ఇద్దరూ మహిళలు, గిరిజనులు, పేదలు, రైతుల హక్కులను కాలరాస్తున్నారని... వీరిద్దరినీ ఇంటికి సాగనంపకపోతే మహిళల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్య మైదానంలో జరుగుతున్న ఐద్వా 14వ రాష్ట్ర మహాసభల్లో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభకు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐద్వా ఉపాధ్యక్షురాలు బృందా కరత్ మాట్లాడుతూ నరేంద్ర మోడీది జేబుదొంగల ప్రభుత్వమని...మోడీపై చంద్రబాబుది దొంగ యుద్ధమని వ్యాఖ్యనించారు. మోడీ విధానాల వల్ల దేశంలో స్త్రీల ఆర్థిక స్వావలంబన, స్వాతంత్య్రం, స్వేచ్ఛ వెనుకబడ్డాయన్నారు.
పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల ఒక్క ఏడాదిలోనే దేశంలో రూ.2.35 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయని ఆమె చెప్పారు. ఈ సొమ్మును పేదల కోసం కాకుండా, పెద్దల కోసం ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో బిజెపి ఎంపీలు, ఎంఎల్ఎల తీరు బాధాకరంగా ఉందన్నారు. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో శిక్షలు తక్కువ మందికే పడుతున్నాయని చెపుతూ...దీనిపై మన్కీ బాత్లో మోడీ ఎందుకు మాట్లాడటం లేదని ఆమె నిలదీశారు.
వృద్ధాప్య పింఛను పెంచాలని మహిళలు కోరుతుంటే నిధుల్లేవని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్లు దోచిపెడుతున్నాయని దుయ్యబట్టారు. సిఎం చంద్రబాబు గిరిజన హక్కులను కాలరాస్తున్నారని,పోలవరం ముంపు బాధితులకు పునరావాసం కల్పించకుండా ఇబ్బందులుపెడుతున్నారని ఆమె చెప్పారు. మద్యంపై మహిళలు యుద్ధం ప్రకటించాలని...మోడీ, బాబుకు వ్యతిరేకంగా వామపక్షశక్తులతో కలిసి పోరాడాలని సూచించారు. మహిళలకు రక్షణగా ఉన్న చట్టాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో చర్చకు వచ్చేలా మహిళలంతా ఉద్యమించాలని బృందా కరత్ పిలుపునిచ్చారు.