కేసీఆర్కు పరిపక్వత ఉందంట,నాకు లేదంట...మోడీ అంటున్నారు:చంద్రబాబు,ఎమ్మెల్యే అలకతో సిఎంకు మరోషాక్
శ్రీకాకుళం:ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబునాయుడు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ పార్లమెంట్ లో మాట్లాడుతూ కేసీఆర్కు పరిపక్వత ఉందని...తనకు లేదని ఏకంగా సభలో చెప్పారని చంద్రబాబు మండిపడ్డారు.
దేశంలో ఏపీని నెం.1 చేస్తానని సంకల్పం చేశానని సిఎం చంద్రబాబు వెల్లడించారు. బాబ్లీ ప్రాజెక్టుపై ఆందోళన సందర్భంగా మహారాష్ట్ర పోలీసులు తమను అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఆ తరువాత అప్పట్లోనే కేసులు లేవని చెప్పిన మహారాష్ట్ర ఇప్పుడు వారెంట్లు పంపించారని దుయ్యబట్టారు. మరోవైపు టిడిపి ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అలిగి సభా వేదిక నుంచి వెళ్లిపోవడంతో సిఎంతో సహా అంతా అవాక్కయ్యారు.
ఏదేమైనా రాష్ట్రానికి అన్యాయం చేస్తే రాజీలేని పోరాటం చేస్తానని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వాసులు ఈ దేశ పౌరులా...కాదా?...అని ఆయన నిలదీశారు. మనం కేంద్రనికి పన్నులు కట్టడం లేదా?...మరెందుకు ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో తెలుగుజాతి ఎక్కడ ఉన్నా రాష్ట్రం కోసం పోరాడాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కేంద్రం ఎపికి సహకరిస్తే మరింత అభివృద్ధి జరిగేదని, కేంద్రం సహకరించకపోయినా 10.5 శాతం గ్రోత్ రేటు సాధించామని సిఎం చంద్రబాబు వివరించారు. విద్యుత్ ధరలు పెంచబోమని చెప్పిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. మన రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని, హైదరాబాద్ అభివృద్ధి ప్రతి అడుగులో తన కృషి ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు కేంద్రంతో కుమ్మక్కై రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు.
మరోవైపు శ్రీకాకుళం సభ సందర్భంగా సిఎం చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. టిడిపి ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అలిగి సభా వేదిక నుంచి దిగి వెళ్లిపోవడంతో ముఖ్యమంత్రితో సహా అంతా అవాక్కయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే శివాజీని సముదాయించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. శివాజీ చెప్పినా ఒక కార్యకర్తను లోపలకు అనుమతించక పోవడమే ఇందుకు కారణమని తెలిసింది. సభా ప్రాంగణం వద్ద నుంచి తన కారెక్కి వెళ్లిపోయేందుకు ఉద్యుక్తులు కాగా ఆయనతో పాటు ఆయన కుమార్తె, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష కూడా తన తండ్రితో పాటు కారెక్కి వెళ్లిపోయారు.