మరోసారి ఇలా జరిగితే ఊరుకోను...టిడిపి ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
Recommended Video
అమరావతి: అసెంబ్లీ సమావేశాల తొలిరోజే టీడీపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఎదురైంది. శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ సమీపంలోని వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి అక్కడ నుంచి నేరుగా అసెంబ్లీకి రావాలని చంద్రబాబు నిర్ణయించారు.
అయితే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత,ముఖ్యమంత్రే స్వయంగా పాల్గొంటున్నా...కార్యక్రమం గురించి ముందుగానే హెచ్చరించినా చివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసి కేవలం పదిహేను మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు ఆ తర్వాత అక్కడనుంచి వచ్చేశాక ఉభయ సభల విప్లను పిలిచి వారికి గట్టిగా క్లాస్ తీసుకొన్నారు. వివరాల్లోకి వెళితే...
ఎపి అసెంబ్లీ అమరావతికి మారాక వెంకటపాలెంలోని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లడం సీఎం చంద్రబాబు ఆనవాయితీగా పెట్టుకున్నారు. హైదరాబాద్లో సమావేశాలు జరిగినప్పుడు చంద్రబాబు ఇదేవిధంగాఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించి వెళ్ళేవారు.
అయితే తాజాగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించే ఈ కార్యక్రమంలో శాసన సభ,శాసనమండలి నుంచి పట్టుమని 15మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ఈ ముఖ్యమైన కార్యక్రమానికి రాలేదు. టిడిపి నుంచి ఉభయసభల్లో దాదాపు 160మంది ప్రజాప్రతినిథులు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనైనట్లు తెలిసింది. ఇలా చేయడం పార్టీకి సరైన గౌరవం ఇచ్చినట్లు కాదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారట. అంతేకాదు చంద్రబాబు ఆ తర్వాత అక్కడనుంచి రాగానే ఉభయ సభల విప్లను పిలిచి వారికి గట్టి హెచ్చరిక చేశారు. "పార్టీ ఒక కార్యక్రమం చేయాలని అనుకొంటే అందరూ పాల్గొనాలి...పదవులు రాగానే పెద్దవాళ్ళు కారు...బాధ్యతలు పెరుగుతాయి. వాటికి న్యాయం చేయాలి...నేను రాగా లేనిది మీకు ఇబ్బంది ఏమిటి?...ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఠంచనుగా పాల్గొనేవాళ్ళు...అధికారంలోకి రాగానే బద్ధకస్తులుగా మారితే ఎలా?...మరోసారి ఇలా జరిగితే ఊరుకోను"...అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.