పవన్కు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత:సిపిఐ రామకృష్ణ;రాజకీయ పరిణతి లేదు:కత్తి మహేష్
Recommended Video
విజయవాడ:పవన్ కల్యాణ్కు ఏమైనా జరగరానిది జరిగితే రాష్ట్రం భగ్గుమనడం ఖాయమని, ఇందుకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.
తనకు భద్రత లేదని పవన్ కళ్యాణ్ అంత స్పష్టంగా చెబుతున్నా ముఖ్యమంత్రి ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ కు వెంటనే పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సిపిఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పరిణతి లేకుండా మాట్లాడుతున్నారని సినీ విమర్శకుడు కత్తి మహేశ్ విమర్శించారు.
శాంతిభద్రతలు...దిగజారుతున్నాయి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు అంతకంతకూ దిగజారుతున్నాయని అన్నారు. విశాఖ జిల్లాలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపారని...అనంతపురంలో ఎంపీ, పోలీసులకు మధ్య వివాదాలు రోడ్డుకెక్కాయని చెప్పారు. గడచిన నాలుగేళ్లు నిరుద్యోగ భృతిని పక్కన పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయని దీన్ని తెర మీదకు తెచ్చారని రామకృష్ణ ఆరోపించారు.
ప్రాణాలమీద ఆశలు వదిలేశా, డ్రోన్లతో నిఘా, లగడపాటి నాతో చెప్పారు: పవన్ కళ్యాణ్
కూలికి వెళ్తే...అంతకంటే ఎక్కువ
అయినా ఉద్యోగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఉద్యోగాలు కల్పించకుండా సవాలక్ష షరతులు పెట్టి నెలకు రూ.1000 భృతి ఇస్తామంటున్నారని మండిపడ్డారు. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి చూస్తుంటే రోజూ అన్న క్యాంటీన్లో అన్నం తిని చెట్టు కింద పడుకోమన్నట్లుగా ఉందని దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకం కింద కూలిపనులకు పోయినా ఇంతకంటే ఎక్కువే వస్తుందని రామకృష్ణ అన్నారు. కరువు ప్రాంత సమస్యలపై ఉద్యమించేందుకు సీపీఐ, సీపీఎం అక్టోబరు 3వ తేదీన సమావేశమవుతున్నట్లు రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.
పవన్ కు...ఆ పరిణతి లేదు
మరోవైపు ఒంగోలులో సినీ విమర్శకుడు కత్తి మహేష్ మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పరిణతి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇటీవల ఓ సభలో తనకు ప్రాణహాని ఉందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిణతిని తెలియజేస్తున్నాయని కత్తి మహేష్ వ్యాఖ్యానించారు. గతంలో శ్రీరెడ్డి ఉదంతం జరిగినప్పుడు ఆమెకు పోలీసులను ఆశ్రయించాలంటూ సూచించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనపై కుట్ర జరుగుతుందని తెలిసి కూడా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కత్తి మహేష్ ప్రశ్నించారు.
భద్రత...కోరలేదెందుకు?
పవన్ కళ్యాణ్ కు నిజంగా ప్రాణహాని ఉంటే ఆయన ఎందుకు భద్రత కోరలేదని కత్తి మహేష్ నిలదీశారు. దళితులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దళితుల్లో కొత్త నాయకత్వం తెచ్చేందుకు తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నానని కత్తి మహేష్ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో దళిత, గిరిజనుల హక్కులను కాపాడే ఓ పార్టీ తరఫున రాష్ట్రంలోని ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేయడం జరుగుతుందన్నారు.