సోమవారం సీఎం చంద్రబాబుకు...హోంగార్డుల ఆత్మీయ సత్కారం
విజయవాడ:ముఖ్యమంత్రి చంద్రబాబుకు జులై 2 న హోంగార్డులు ఆత్మీయ సన్మానం చేయనున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరగనున్న సన్మానం కోసం ఏర్పాట్లపై శనివారం కృష్ణా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విజయ క్రిష్ణన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభకు హాజరయ్యే వారికి నీరు, పరిసరాల శుభ్రత, మరుగుదొడ్ల ఏర్పాట్లను మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రధాన డయాస్పై ప్రొటోకాల్ ప్రకారం సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసే విషయమై జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
రిఫ్రెష్మెంట్ ఏర్పాట్ల విషయాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. ఈ సత్కారంకు పెద్ద సంఖ్యలో హోంగార్డులతో పాటు ఆహుతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ప్రతి గ్యాలరీకి ఇన్చార్జి ఆఫీసర్లను నియమించాలన్నారు. అలాగే గ్యాలరీలలో అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ఇటీవలే రాష్ట్రంలోని హోంగార్డుల దినసరి వేతనం రూ.300 నుంచి రూ.600 రూపాయలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో హోం గార్డులు కృతజ్ఞతగా ఈ ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు. అమరావతి ప్రజాదర్బార్ హాల్లో హోగార్డులు సీఎంను కలిసి తమ సమస్యల్ని విన్నవించుకోగా ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం..వేతనాలు రెట్టింపు చేయడంతోపాటు మెటర్నిటీ సెలవులను మూడు నెలలను పెంచడం వంటి వరాల జల్లు కురిపించారు.